Share News

ఈ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎందుకు?: కవిత సూటి ప్రశ్న

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:28 PM

ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ తుది దశకు చేరుతుందని తాను అనుకోవడంలేదని ఆమె అన్నారు.

ఈ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎందుకు?: కవిత సూటి ప్రశ్న
Kavitha

హైదరాబాద్, జనవరి 21: ఫోన్ ట్యాపింగ్ కేసుకు(Phone Tapping Case) సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఎందుకు విచారణ చేపట్టారని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పట్లో తుది దశకు చేరుతుందని తాను అనుకోవడంలేదని ఆమె చెప్పారు. విచారణ వల్ల తనలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందని భావించటంలేదని కవిత అన్నారు.


సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిందే..

పొలిటికల్ పవర్ బలహీన వర్గాలకు వచ్చినప్పుడే ఆ సమాజం బాగుపడుతుందన్నారు కవిత. చాలామంది ఎన్నికల్లో పోటీచేస్తామని అడుగుతున్నారని.. కానీ జాగృతి పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాలేదని వెల్లడించారు. యువత, మహిళలు ఎక్కడ పోటీచేసినా జాగృతి మద్దతిస్తుందని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీసీలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం వాటా ఇవ్వకుండానే ప్రభుత్వం ఎన్నికలకు వెళుతోందని విమర్శించారు. జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. పీవీ.నరసింహారావు పేరు ఏదో ఒక జిల్లాకు పెట్టాలని కూడా కవిత కోరారు.


కొత్త పార్టీపై...

కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు, యువతకు నష్టం జరిగిందని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐదు శాతం ఓపెన్ కోటాను నాన్ లోకల్‌గా మార్చడంతో రాష్ట్ర యువతకు నష్టం జరుగుతోందని తెలిపారు. జాగృతి తరఫున అధ్యయనం చేస్తున్నామని.. జిల్లాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తే నివేదిక ఇస్తామని తెలిపారు. కొత్త పార్టీ ఏర్పాటు కసరత్తు వేగంగా జరుగుతోందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తవుతుందో లేదో చూడాలని కవిత అన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద కూడా అడ్డంకులు సృష్టించే అవకాశం లేకపోలేదని తెలిపారు. పార్టీకి ఇంకా ఏ పేరు అనుకోలేదని.. తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి అని కొందరు సూచించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అంశానికి కూడా న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు లేదని అన్నారు. నైని బొగ్గు గని అంశం కంటే సింగరేణికి కొత్త బొగ్గు గనులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ విధానం ఎప్పటి నుంచో ఉందని.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన నిబంధనగా పెట్టారని.. కొంత మందికి మాత్రమే సెలెక్టివ్‌గా ఇస్తున్నారని తెలిపారు. విచారణ చేయించాల్సిన కాంగ్రెస్ నేతలు లేఖ రాయాలని కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. జాగృతి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2014 నుంచి సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు.


ఆ విషయం నాకు తెలీదు..

గతంలో సర్పంచ్‌లను కలవని వారు ఇప్పుడు వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారని.. ఇది సంతోషించదగ్గ విషయమన్నారు కవిత. దాంతో సామాజిక తెలంగాణ వైపు కొంత మేర అడుగులు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారన్న అంశం గురించి తనకు తెలీదని, తాను ఇప్పుడు బీఆర్ఎస్‌లో లేనని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ 300 డివిజన్ల ప్రతిపాదన బీఆర్ఎస్ హయాంలోనిదే అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కొనసాగిస్తోందన్నారు. జాగృతి జనంబాట ముగింపు మార్చి పదో తేదీన అనుకుంటున్నామని.. ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై ర్యాంకులు ప్రకటిస్తామని కవిత పేర్కొన్నారు.


ఎవరినీ సంప్రదించలేదు..

‘నా టార్గెట్ హరీశ్ రావు, ఇంకా పెద్ద టార్గెట్ కూడా ఉంది. కేటీఆర్‌ను కూడా విమర్శించాను. బలమైన రాజకీయ భవిష్యత్ కోసం పటిష్ట ఎజెండా సిద్ధం చేసుకుంటున్నాను, ఈ దశలో నాకు నేనుగా ఎవరితోనూ మాట్లాడను. రాజకీయ కన్సల్టెన్సీలు ఎవరినీ నేను సంప్రదించలేదు, నన్ను సంప్రదించిన కొంత మందితో మాట్లాడాను’ అని కల్వకుంట్ల కవిత వెల్లడించారు.


ఉద్యమకారులను పట్టించుకోలేదు..

తెలంగాణ ఉద్యమకారులు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదని విమర్శించారు. ట్యాంక్‌బండ్ మీద ఆంధ్రావారి విగ్రహాలు తప్ప తెలంగాణ మహనీయులవి లేవని.. వాళ్ల విగ్రహాలు తొలగించాలని తాము అనటం లేదని.. అవసరం వస్తే తప్పదంటూ వ్యాఖ్యానించారామె. అమరజ్యోతిపై అవినీతి మరకలు పడ్డాయని, అందుకే దాన్ని ఓపెన్ చేయడంలేదని కవిత అన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆస్పత్రులకు పెరుగుతున్న బాధితులు

ఆదాయానికి మించి ఆస్తులు.. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 01:37 PM