హైదరాబాద్లో గంజాయి చాక్లెట్ల కలకలం.. నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - Aug 29 , 2026 | 01:50 PM
హైదరాబాద్లో పాన్షాప్ ముసుగులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 5 వేలకుపైగా గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 29: నగరంలోని శామీర్పేట్లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుపడటం కలకలం రేపింది. యువత, చిన్నారులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి భారీఎత్తున గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన బైద్నాథ్, అతడి భార్య పూజారి కొంతకాలంగా శామీర్పేట్లో నివసిస్తున్నారు. వారు ఓ పాన్షాప్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటుపడిన వారు.. గంజాయిని చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నారు. పాన్షాప్ ముసుగులో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. సదరు షాప్పై దాడి చేశారు. బైద్నాథ్ను అరెస్ట్ చేసి 25 కేజీల బరువున్న 5,298 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అతడి భార్య కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు పాఠశాలలు, కాలేజీల వద్ద నిఘా పెంచారు. తల్లిదండ్రులు తమ పిల్లలు కొనుగోలు చేసే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
ఇవీ చదవండి:
నేపాల్ వరదల్లో గల్లంతైన హైదరాబాదీ కుటుంబం.. రంగంలోకి సర్కార్!
కొత్త కారు పూజ కోసం వచ్చి.. అదే కారు కింద పడి..