బూమ్.. బూమ్.. బుమ్రుక్
ABN , Publish Date - Mar 05 , 2026 | 09:03 AM
మహానగరంలో చెరువుల పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో ఆరు చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన హైడ్రా ఇప్పటికే బతుకమ్మకుంటను అందుబాటులోకి తీసుకువచ్చింది.
పూర్తయిన చెరువు సుందరీకరణ
రేపు ప్రారంభించనున్న సీఎం
అందుబాటులోకి రానున్న రెండో చెరువు
హైదరాబాద్ సిటీ: మహానగరంలో చెరువుల పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో ఆరు చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన హైడ్రా ఇప్పటికే బతుకమ్మకుంటను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా మరో రెండు చెరువులు అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తయి సిద్ధంగా ఉన్నాయి. పాతబస్తీలోని బుమ్రుక్దౌల చెరువును సీఎం రేవంత్రెడ్డి రేపు ప్రారంభిస్తారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రెండు, మూడు రోజుల అనంతరం కూకట్పల్లి(Kukatpally)లోని నల్ల చెరువునూ ప్రారంభించనున్నారు. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణం అందించాలనే ఉద్దేశంతో రేవంత్రెడ్డి ప్రత్యేకంగా హైడ్రా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.75వేల కోట్ల విలువైన ప్రభుత్వ, చెరువుల స్థలాలను కాపాడింది.
పాతబస్తీ సిగలో..
పాతబస్తీలో ఆక్రమణలతో కుచించుకుపోయిన, కాలుష్య కాసారంగా మారిన నిజాంల కాలం నాటి చారిత్రక బుమ్ రుక్ దౌల చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. మూడో నిజాం హయాంలో 104 ఎకరాల్లో చెరువు నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది. కబ్జాలు, ఆక్రమణలతో 17.05 ఎకరాల్లో చెరువు ఉందని గతంలో హెచ్ఎండీఏ గుర్తించింది. వాస్తవంలో కేవలం 4.12 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా.. హెచ్ఎండీఏ రికార్డుల్లో పేర్కొన్న 17.05 ఎకరాల్లో చెరువును అభివృద్ధి చేసి, దానిపై వాకింగ్ ట్రాక్ నిర్మించారు. కేంద్ర కార్యాలయం నుంచి నిఘా కోసం చుట్టూ సీసీ కెమెరాలూ ఏర్పాటు చేశారు.
రెండో దశలో 14 చెరువులు..
పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం (ఎఫ్టీఎల్) నిర్ధారించిన చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. రెండో దశలోనూ రూ.303 కోట్లతో 14 చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) సాంకేతిక పరిశీలన అనంతరం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!
Read Latest Telangana News and National News