Share News

Harish Rao: సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్ ద్రోహ బుద్ధి బయటపడింది: హరీష్ రావు

ABN , Publish Date - Jan 12 , 2026 | 03:36 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

Harish Rao: సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్ ద్రోహ బుద్ధి బయటపడింది: హరీష్ రావు
Former Minister Harish Rao

హైదరాబాద్, జనవరి 12: నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లమల సాగర్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని వ్యాఖ్యలు చేశారు. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలవరం నిర్మిస్తోందని మండిపడ్డారు. నాడు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ రైతులతో ఏపీ ప్రభుత్వం రిట్ వేయించిందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి సర్కార్‌ ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి ఆరోపించారు.


అది ముగియని కథే...

‘ఈ మాత్రం విషయం మీ న్యాయవాది, మీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా?. ఈ మాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా?’ అంటూ ఎద్దేవా హరీష్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే, పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమే అని హరీష్‌రావు విమర్శించారు. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథే అని మాజీ మంత్రి అన్నారు. ఈలోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకుపోతుందని మండిపడ్డారు. సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్.. సుప్రీంకోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్ అంటూ మాజీ మంత్రి హరీష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


పోను.. పెట్టను అంటూనే ద్రోహం...

పోలవరం-నల్లమల సాగర్ విషయంలో ముందు నుంచీ రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లారని.. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపారన్నారు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశారంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. వేయను అంటూనే కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశారని ఆరోపణలు చేశారు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్లి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపారని మండిపడ్డారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్‌కు మద్దతు ప్రకటించారంటూ సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.


రేవంత్ మాటల ఆంతర్యమేంటి?

తాము నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటామని, సుప్రీంకోర్టుకు వెళ్తామని నమ్మ బలికిన రేవంత్ రెడ్డి, నేడు కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణకు మోసం చేశారని ఆరోపణలు చేశారు. పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు కూర్చొని చర్చించుకుందామన్న రేవంత్ రెడ్డి మాటల అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పచెప్పడమేనా చర్చల లక్ష్యమని నిలదీశారు. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ.. అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని హరీష్ రావు హెచ్చరించారు. ‘రేవంత్ రెడ్డి.. నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తాం’ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

భారీగా చైనీస్ మాంజా సీజ్.. 57 మంది అరెస్ట్

అందుకే ఉపాధి హామీ పథకం పేరు మార్పు: కేంద్ర మంత్రి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 04:29 PM