తెలంగాణ జల హక్కులను కాపాడటంలో సర్కార్ విఫలం: హరీశ్ రావు
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:31 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ జల హక్కులు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని లేఖలో ఆరోపించారు.
హైదరాబాద్, జూన్ 5: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ జల హక్కులు తీవ్ర ప్రమాదంలో పడ్డాయని లేఖలో ఆరోపించారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చోటుచేసుకుందని తెలిపారు. తెలంగాణ జల హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ 74 శాతం వినియోగిస్తుంటే.. తెలంగాణ 25 శాతానికి పరిమితమైందని లేఖలో తెలిపారు.
రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రమాదంలో పడేసిందని మాజీ మంత్రి విమర్శించారు. సోలార్ ఆధారిత విద్యుత్ విధానాలు సాగునీటి రంగానికి ముప్పుగా మారాయని లేఖలో స్పష్టం చేశారు. అందుకే రైతు డిస్కం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలని అన్నారు. తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా జల హక్కులను సమర్థంగా కాపాడాలని హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరం: రాంచందర్రావు
మైత్రీవనం అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Read Latest Telangana News And Telugu News