సురేఖకు అధిష్ఠానం పిలుపు!
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:12 AM
మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఇటీవలే మంత్రిపదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖకు ...
క్యాబినెట్ హోదాతో కూడిన పదవి ఇచ్చే అవకాశం
ఇటీవలే మీనాక్షి నటరాజన్తో సురేఖ చర్చలు
పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని మీనాక్షి సూచన
నేడు కార్యకర్తలతో సురేఖ భేటీ.. సాయంత్రం ఢిల్లీకి?
హనుమకొండ/ హనుమకొండటౌన్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఇటీవలే మంత్రిపదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖకు క్యాబినెట్ స్థాయి పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ మాట్లాడారని, బర్తరఫ్ తర్వాతి పరిణామాలపై వారు చర్చించారని తెలిసింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని, పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని సురేఖకు మీనాక్షి సూచించారని సమాచారం.
ఈ క్రమంలోనే ఢిల్లీకి రావాలంటూ అధిష్ఠానం నుంచి సురేఖకు కబురు అందింది. ఈ అంశంపై చర్చించడానికి కొండా సురేఖ ఆదివారం ఉదయం 9 గంటలకు హనుమకొండ రాంనగర్లోని తన నివాసంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా రావాలని కొండా మురళి ముఖ్య కార్యకర్తలందరికీ ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. కార్యకర్తలతో భేటీ అనంతరం ఢిల్లీ పెద్దలతో సురేఖ మాట్లాడనున్నారని, ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కాగా, తన మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యంను కొండా సురేఖ పరామర్శించారు. తన కుమారుడిపై కేసుల వ్యవహారంతో ఆందోళన చెందిన సుబ్రమణ్యం శుక్రవారం ఆత్మహత్యయత్నం చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆస్పత్రికి వెళ్లిన కొండా సురేఖ.. సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సుమంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు!
నీళ్లియ్యమని నన్ను అడగొద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News