ఉద్యోగాలపై త్వరలో సీఎం భారీ ప్రకటన: కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకటన
ABN , Publish Date - Feb 03 , 2026 | 06:17 PM
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొలువుల పండగ ఎలా జరిగిందో తెలంగాణ యువతకి తెలుసునని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఎందుకు ఇచ్చామంటే యువతకి భరోసా కల్పించేందుకేనని ఆయన వివరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 03: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నిరుద్యోగులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొలువుల పండగ ఎలా జరిగిందో తెలంగాణ యువతకి తెలుసునన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఎందుకు ఇచ్చామంటే యువతకి భరోసా కల్పించేందుకేనని వివరించారు. నోటిఫికేషన్స్ ఇస్తే కొలువు వస్తుందనే భరోసా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుద్యోగులకు కల్పించామని చెప్పారు. మంగళవారం నాడు నాంపల్లిలోని గాంధీభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విలేకర్లతో మాట్లాడుతూ.. కేటీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలను అంగట్లో సరకులు అమ్మినట్టు అమ్మారని విమర్శించారు.
10 ఏళ్లలో నిరుద్యోగులను బాధపెట్టిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నారంటూ ఆ పార్టీ నాయకులపై మండిపడ్డారు బల్మూరి వెంకట్. వాళ్లకి చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో అమ్ముకున్న ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం.. కేసీఆర్, కేటీఆర్ గడీ కాదన్నారు. తాజాగా టీజీపీఎస్సీ వన్ టైమ్ పాస్ వర్డ్ రిజిస్ట్రార్లు ప్రాసెస్ చేస్తుందని వివరించారు. పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ చేస్తామంటూ.. ఇప్పుడు ఎవరిని రెచ్చగొట్టటానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ ప్రకటన చేస్తారని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మకండంటూ యువతకు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగిత్యాలలో జగడం.. తీవ్రంగా స్పందించిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Read Latest Telangana News and National News