Share News

గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:53 PM

రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు..

గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

వికారాబాద్, ఫిబ్రవరి 21: రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(శనివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ విధానాలు, ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఈ తరగతులు సహాయపడతాయని సీఎం అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు.


భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తుచేశారు. గాంధీజీపై లాఠీలు ఎత్తడానికి బ్రిటిషర్లు బయపడ్డారని, దేశభక్తులమని అనుకునే కొందరు తూటాలతో గాంధీని చంపారని విమర్శించారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, గాంధీ ఆలోచనలపై కూడా భిన్నాభిప్రాయాలు చెప్పినవారు ఉన్నారని తెలిపారు. ‘భిన్నాభిప్రాయాలు చెప్పిన వారిని తరిమేస్తే మనకే నష్టం.. అందరూ కలిసి పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చు’ అని రేవంత్ అన్నారు. రెండున్నర శాతం ఓట్ల నుంచి 40 శాతం వరకు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చామన్నారు. డిజిటల్ మెంబర్‌షిప్‌పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.


పార్టీ బాధ్యతలు తీసుకున్న వారిని వెతికి మరీ పదవులు ఇచ్చామని సీఎం చెప్పుకొచ్చారు. నాయకుల ప్రతీ కదలికను గమనిస్తూనే ఉంటామని.. మెరిట్ కోటా తప్ప కాంగ్రెస్‌లో ఏ కోటా లేదని స్పష్టం చేశారు. మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా విలువైనదని.. ఈ పదవిని దుర్వినియోగం చేస్తే దేవుడు కూడా కాపాడలేడన్నారు. ‘డీసీసీ అధ్యక్ష పదవి మీ ఉన్నతికి తొలిమెట్టు’ అని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనాయకులను అవమానపరచాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


షర్మిలపై పొగడ్తలు..

ఈ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. రాజకీయ వారసత్వం నుంచి షర్మిల వచ్చినా ఆమె అవకాశాలను తీసుకోలేదన్నారు. ముళ్లబాటలో కూడా ఏపీలో కాంగ్రెస్ కోసం షర్మిల కష్టపడుతున్నారని తెలిపారు. ప్రజల దగ్గరికి వెళ్ళి రాజకీయాల్లో రాణించాలని షర్మిల చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాగా, డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. అలాగే, రెండు రాష్ట్రాల నుంచి సుమారు 70 మంది డీసీసీ అధ్యక్షులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

మొబైల్ షాప్‌లో చెలరేగిన మంటలు.. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు 13 ఏళ్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 05:13 PM