Share News

వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:36 PM

శ్రీవారి ఫొటోలతో వైసీపీ సభ్యులు చేసిన నిరసనలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్‌ చెప్పిందని సీఎం పేర్కొన్నారు..

వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

పల్నాడు జిల్లా, ఫిబ్రవరి 21: ఏపీ శాసనమండలిలో వేంకటేశ్వర స్వామి ఫొటోలతో వైసీపీ సభ్యులు చేసిన నిరసనలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ అంశంపై వినుకొండ సభలో సీఎం మాట్లాడుతూ.. చెప్పులు‌ వేసుకుని‌ వేంకటేశ్వరస్వామి ఫొటోలను విసిరేశారని మండిపడ్డారు. శ్రీవారి విషయం బయట మాట్లాడకూడదని రెండు రోజులుగా ఆగానన్నారు. వేంకటేశ్వరస్వామి స్వయంగా తనను కాపాడారని.. వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేశారని చెబితే హెరిటేజ్‌ను తెరపైకి తీసుకొచ్చారన్నారు. ‘నేను ప్రాణం పోయినా తప్పు చేయను’ అని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్‌ చెప్పిందన్నారు. తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పును పక్క వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారన్నారు. అలాంటి కరుడుగట్టిన నేరస్థుడితో రాజకీయం చేయాలా అని విమర్శించారు.


జైలుకు వెళ్తానని ఊహించలేదు..

తాను కూడా జైలుకు వెళ్తానని ఊహించలేదని.. నోటీసు ఇస్తే సమాధానం చెప్పేవాడినని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నా ప్రాణం పోయినా పరవాలేదు... రాష్ట్రం కోసం పోరాడతాను’ అని చెప్పుకొచ్చారు. చాలా మంది తాను జైల్లో నుంచి ప్రాణాలతో బయటకురారని అనుకున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మట్లాడుతున్నారని.. రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.


అదే వారికి చివరి రోజు..

డ్రగ్స్‌ మత్తులో ఆడబిడ్డల జోలికొస్తే వారికదే చివరిరోజు అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వివేకా హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం నెట్టారని.. వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారంటూ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సులో కాంగ్రెస్‌ తీరు ఆవేదన కలిగించిందన్నారు. కాంగ్రెస్‌ తీరు దేశానికి మంచిది కాదన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలని తెలిపారు. దేశానికి మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ

దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తారా.. వైసీపీపై మంత్రి ఫైర్..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 05:21 PM