దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తారా.. వైసీపీపై మంత్రి ఫైర్..
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:33 PM
వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు..
కృష్ణా, ఫిబ్రవరి 21: ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి కొల్లురవీంద్ర (Minister Kollu Ravindra) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లాలోని మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉందన్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన దేవాలయం లాంటి అసెంబ్లీని.. వైసీపీ సభ్యులు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ‘జగన్ అసెంబ్లీకి రారు.. శాసనమండలిలో సభ జరగనివ్వరు’ అంటూ మంత్రి విరుచుకుపడ్డారు.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు మద్యం పేరుతో దోచుకోవడమే కాకుండా భూములను కూడా దోచుకున్నారని కొల్లురవీంద్ర ఆరోపించారు. ఆఖరికి ప్రపంచమంతా పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కూడా కల్తీ చేశారన్నారు. తిరుమల లడ్డూలో నెయ్యి వాడకుండా నెయ్యిని సృష్టించారంటూ దుయ్యబట్టారు. కలియుగ దైవంగా భావించే వేంకటేశ్వర స్వామి పటాన్ని.. కాళ్లకు చెప్పులు వేసుకుని పట్టుకుని మరీ శాసనమండలిలో తిరిగారన్నారు.
సొంత ఖర్చులతో మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తే.. దాన్ని కూడా రాజకీయం చేశారంటూ మంత్రి మండిపడ్డారు. మంత్రి లోకేశ్ ప్రభుత్వధనాన్ని ఎక్కడా వృథా చేయలేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కాగా, సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్రకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆపై స్వామివారి నాగులపుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి
డ్రగ్స్పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ
Read Latest AP News And Telugu News