Share News

మహిళా రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు: ఎంపీ డీకే అరుణ

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:05 PM

డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ కౌంటర్‌ ఇచ్చారు. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లను దేశమంతా హర్షిస్తుంటే.. సీఎం రేవంత్‌ మాత్రమే విమర్శలు చేస్తున్నారు డీకే అరుణ అన్నారు.

మహిళా రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు: ఎంపీ డీకే అరుణ
DK Aruna

హైదరాబాద్, ఏప్రిల్ 13: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్ అంశానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తూనే డీలిమిటేషన్‌పై విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు.


మహిళా రిజర్వేషన్.. పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి సాయపడుతుందని డీకే అరుణ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు ఆమె సూచించారు. ఈ రిజర్వేషన్ల ద్వారా చట్టసభల్లో మహిళలకు సమాన అవకాశాలు లభిస్తాయని, దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇలాంటి చట్టాలు మహిళలకు చాలా మేలు చేస్తాయని ఎంపీ తెలిపారు. రిజర్వేషన్లతో చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుందని డీకే అరుణ అన్నారు.


అలానే డీలిమిటేషన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్‌ రెడ్డికి అవగాహన లేదన్నారు. తాము కూడా దక్షిణాదిలోనే ఉన్నామని, అన్యాయం జరగనివ్వబోమని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్‌ జరుగుతుందని, ఈ ప్రక్రియకు రెండేళ్ల సమయం పడుతుందని అన్నారు. డీలిమిటేషన్‌, మహిళల రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్‌ను కోరుతున్నానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రేవంత్‌కే వదిలేస్తున్నాని కిషన్‌రెడ్డి అన్నారు.


ఇవి కూడా చదవండి...

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ

సమ్మెపై ఆలోచించండి.. తొందరపడొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

Updated Date - Apr 13 , 2026 | 05:53 PM