ఎమ్మెల్యే మోసం చేసిండు..
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:30 AM
ఎమ్మెల్యే మోసం చేసిండు.. నమ్మించి గొంతు కోసిండు.. అంటూ ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మరిపెడ మునిసిపల్ 2వ వార్డు నుంచి కాంగ్రెస్ రెబల్ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్న బానోత్ బుజ్జిదావు కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కుటుంబం ఆరోపణ
ఒంటిపై పెట్రోల్ పోసుకున్న అభ్యర్థి కుమారుడు
మరిపెడ(మహబుబాబాద్): ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ తమకు బీ- ఫామ్ ఇస్తానని మోసం చేశారని మహబూబాబాద్ జిల్లా మరిపెడ(Maripeda) మునిసిపల్ 2వ వార్డు నుంచి కాంగ్రెస్ రెబల్ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్న బానోత్ బుజ్జిదావు కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుధవారం చోక్లాతండా రోడ్డుపై కందకం తీసి, నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ కుటుంబ సభ్యులపై మరిపెడ పోలీసులు బెదిరించడంతో బుజ్జిదావు దంపతుల కుమారుడు నరేశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. బుజ్జిదావు స్థానిక విలేకరులకు వారికి జరిగిన అన్యాయంపై వివరిస్తూ విలపించారు.
రాంచంద్రునాయక్ గెలుపు కోసం అహర్నిశలు పని చేశామన్నారు. మరిపెడ మునిసిపల్ రెండోవార్డు నుంచి గెలుపునకు చేరువలో ఉన్న తమకు కాకుండా వేరొకరికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రఘువీర్రెడ్డి టికెట్ అమ్ముకోగా, ఆయనకే ఎమ్మెల్యే మద్దతు పలికి తమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అప్పుసప్పు చేసి లక్షల రూపాయాలు తీసుకుపోయి డిపాజిట్ చేస్తే బీ- ఫామ్ ఇవ్వలేదన్నారు.
చోక్లాతండాకు వెళ్లే రహదారికి తమసొంత భూమిని ఇచ్చామని, రాంచంద్రునాయక్ చేసిన మోసంతో ఆ భూమిని తామే తీసుకుంటామని ఎవ్వరిని రోడ్డుపై నడవనివ్వమని కందకం తీసి నిరసన వ్యక్తం చేశారు. రాంచంద్రునాయక్, రఘువీర్రెడ్డి పోలీసులతో తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ తమకు న్యాయం చేసే వరకు రోడ్డుపై ఎవ్వరిని నడవనివ్వమని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
Read Latest Telangana News and National News