‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:35 AM
కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పూర్తిస్థాయి నివేదిక త్వరలో రానుందని, దీనిపై తప్పనిసరిగా విచారణ జరిపి, అక్రమార్కులందరినీ అరెస్ట్ చేస్తారని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ చెప్పారు.
నగరాల్లో ప్రచార సదస్సులు జరుపుతాం: పీవీఎస్ మాధవ్
విజయవాడ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పూర్తిస్థాయి నివేదిక త్వరలో రానుందని, దీనిపై తప్పనిసరిగా విచారణ జరిపి, అక్రమార్కులందరినీ అరెస్ట్ చేస్తారని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ చెప్పారు. విజయవాడలో బుధవారం ఆయన మాట్లాడారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీలోని చాలామందిని సస్పెండ్ చేశామన్నారు. దోషులు, వారిని ప్రోత్సహించిన వారిని తప్పకుండా అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏవిధమైన నిబంధనలు పెట్టాలనే విషయమై కూటమి నేతలు త్వరలోనే చర్చిస్తారని చెప్పారు. సంత్ రవిదా్సజీ 649వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 500కు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాధవ్ తెలిపారు. విజయవాడలోని సంత్ రవిదాస్ వారసులను సత్కరిస్తామన్నారు. ఈనెల 7న విజయవాడలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బడ్జెట్ గురించి వివరిస్తారన్నారు. బడ్జెట్లో కల్పించిన వెసులుబాట్లను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని ఔట్రీచ్ పేరుతో నిర్వహిస్తున్నామన్నారు.