ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:50 AM
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. దీనికి సన్నాహకంగా టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. అయితే ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉండగానే టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. కాగా దీనికి సన్నాహకంగా టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి మూడు మ్యాచులు గెలిచిన టీమిండియా 3-0తో సిరీస్ దక్కించుకుంది. ముఖ్యంగా గువాహటి వేదికగా జరిగిన మూడో టీ20లో 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించింది. ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉండగానే టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ దక్కించుకున్న నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) స్పందించాడు.
‘న్యూజిలాండ్తో ఈ సిరీస్ కేవలం సూప్ లాంటిది. అసలు విందు ఫిబ్రవరి 7న మొదలు కానుంది. న్యూజిలాండ్తో సిరీస్ గెలిచారు. ఇక టీ20 ప్రపంచ కప్ను నిలబెట్టుకునే పని చూడాలి. భారత ఆటగాళ్ల సన్నద్ధత బాగుంది. కొందరు బ్యాటర్లు పెద్దగా ఆడే అవకాశం కూడా రాలేదు. వాళ్లందరూ లయ, హిట్టింగ్ మీద దృష్టి సారించారు. భారత జట్టు ప్రపంచ కప్ను ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోవట్లేదు. పూర్తి ఆత్మవిశ్వాసంతో సాగుతోంది. బ్యాటింగ్ ఆర్డర్లో కింది వరుసలో హార్దిక్ పాండ్య, రింకు సింగ్ లాంటి ఆటగాళ్లున్నారు. గత రెండు మ్యాచుల్లో వారికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అంత సులువుగా గెలిచేస్తున్నారంటే జట్టు బ్యాటింగ్ లోతు, సామర్థ్యం ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు’ అని సన్నీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
మా వాళ్లతో జాగ్రత్త.. పాక్కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్
అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ