Share News

కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా: స్మృతి మంధాన

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:03 PM

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ గైర్హాజరీలో జట్టును నడిపించేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన స్పష్టం చేసింది.

కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా: స్మృతి మంధాన
Smriti Mandhana

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ గైర్హాజరీలో జట్టును నడిపించేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన స్పష్టం చేసింది. వైస్ కెప్టెన్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ నాయకత్వ బాధ్యతలకు అవసరమైన అనుభవం సంపాదించానని, అవకాశం వస్తే జట్టు పగ్గాలు అందుకోవడానికి వెనుకాడబోనని తెలిపింది. ఇంగ్లండ్‌పై ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్టు మ్యాచ్ చారిత్రక విజయం తర్వాత స్మృతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.


హర్మన్ స్థానంలో కెప్టెన్సీ చేయడానికి రెడీగా ఉన్నారా? అనే ప్రశ్నకు స్మృతి మంధాన సమాధానం ఇచ్చింది. ‘అవును.. సిద్ధంగా ఉన్నా. హర్మన్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టానికి అస్సలు ఆలోచించను’ అని స్పష్టం చేసింది. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి మహిళల టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మంధాన గుర్తు చేసుకుంది. ‘లార్డ్స్‌లో జరిగిన తొలి మహిళల టెస్టులో భాగం కావడం గొప్ప అనుభూతి. అంతేకాదు, ఆ మ్యాచ్‌లో భారత్‌ విజయంలో నేను కీలక పాత్ర పోషించగలగడం మరింత ప్రత్యేకం. చిన్నప్పటి నుంచి ప్రతి క్రికెటర్ టెస్టు క్రికెట్ ఆడాలని కలలు కంటారు. అలాంటి మ్యాచ్‌ను లార్డ్స్‌లో ఆడటం నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది’ అని స్మృతి వెల్లడించింది. ఆ మ్యాచ్‌లో స్మృతి రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం.


29 ఏళ్ల మంధానకు కెప్టెన్‌గా కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆమె భారత్‌కు 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, నాలుగు వన్డేలకు నాయకత్వం వహించింది. మొత్తం 22 మ్యాచ్‌ల్లో 15 విజయాలు అందించింది. ముఖ్యంగా ఆమె కెప్టెన్సీలో భారత్ ఆడిన నాలుగు వన్డేల్లోనూ ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు.


ఇవి కూడా చదవండి:

అర్జెంటీనాను తొలగించాలని.. 75 లక్షల మంది సంతకాలతో పిటిషన్!

జపాన్ ఓపెన్ టోర్నీ: భారత్‌కు షాక్.. లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి ఔట్

Updated Date - Jul 15 , 2026 | 04:08 PM