భయపడితే విజయం దక్కదు.. నిర్భయంగా ఆడండి: శ్రేయస్ అయ్యర్
ABN , Publish Date - Jul 22 , 2026 | 09:24 PM
భారత జట్టు గురువారం నుంచి జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముందు భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. జట్టుకు ధైర్యం చెప్పాడు. బయట విమర్శలను పట్టించుకోకుండా.. వైఫల్యాలకు భయపడకుండా ఆడితేనే ఉత్తమ ప్రదర్శన చేయాలని సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత భారత టీ20 జట్టు ఇంకా గెలుపు రుచి చూడలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వరుస పరాభవాలు ఎదుర్కొన్న టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. గురువారం నుంచి జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముందు భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. జట్టుకు ధైర్యం చెప్పాడు. బయట విమర్శలను పట్టించుకోకుండా.. వైఫల్యాలకు భయపడకుండా ఆడితేనే ఉత్తమ ప్రదర్శన చేయాలని సూచించాడు.
‘ఇంగ్లండ్ పర్యటనలో మేం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. అయినప్పటికీ అందులో ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. జట్టుగా ఎక్కడ మెరుగుపడాలి, మైదానంలో ఎలా ఆలోచించాలి, పరిస్థితులకు ఎలా అలవాటు పడాలి.. వంటి అంశాలపై మాకు స్పష్టత వచ్చింది. వైఫల్యానికి భయపడకూడదు. అలాంటి ఆలోచనలు మనసులో ఉంటే మన ఆటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆడతాం. భయం లేకుండా ఆడితేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటపడుతుంది. బయట ఎవరు ఏమంటున్నారో ఆలోచించాల్సిన అవసరం లేదు. వర్తమానంపైనే దృష్టి పెట్టాలి. జట్టుగా కలిసి మంచి క్రికెట్ ఆడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయి’ అని అయ్యర్ సూచించాడు.
జింబాబ్వేను తేలిగ్గా తీసుకోవద్దు..
‘జింబాబ్వేలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కొందరు ఐపీఎల్ కూడా ఆడారు. కాబట్టి వారిని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆశించిన స్థాయిలో సాగలేదు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత అతడికి సాధన చేసేందుకు సమయం లభించింది. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకుని ఉంటాడు. అందుకే నేను ప్రత్యేకంగా అతడికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్కు లలిత్ మోదీ!
టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. సమన్వయ లోపమే కారణమా?