ఐపీఎల్ ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్కు లలిత్ మోదీ!
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:48 PM
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ భారత్కు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం కేసులో లలిత్ మోదీకి అప్పిలేట్ ట్రైబ్యూనల్ అనుకూలంగా తీర్చునిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ భారత్కు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కేసులో లలిత్ మోదీకి అప్పిలేట్ ట్రైబ్యునల్ అనుకూలంగా తీర్చునిచ్చింది. ఈ తీర్పు అనంతరం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 16 ఏళ్ల న్యాయపోరాటానికి టైబ్యునల్ తీర్పు ముగింపు పలికిందని తెలిపారు. 2010 నుంచి విదేశాల్లో ఉంటున్న లలిత్ మోదీ.. ఈ ఏడాది చివర్లో లేదా 2027 ఆరంభంలో భారత్కు తిరిగొచ్చే అవకాశం ఉందని తెలిపాడు.
‘ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ఎంతో సంతోషంగా ఉన్నాను. 16 ఏళ్లుగా దీనిపై పోరాడుతున్నాను. ఇప్పటివరకు మీడియాకు, అందరికీ నేను చెప్పిన విషయాలే నిజమని తేలింది. ట్రైబ్యునల్ తీర్పు నాకు అనుకూలంగా రావడం ఆనందంగా ఉంది. నాకెప్పుడూ ఐపీఎల్ ప్రయోజనాలే ముఖ్యం. ఆ అధ్యాయం ఇప్పుడు ముగిసింది. జీవితంలో ముందుకు సాగాలని, భారత్కు తిరిగిరావాలని ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో భారత్కు వస్తా. అక్టోబర్లో నా కుమార్తెకు బాబు పుట్టబోతున్నాడు. అంతా సవ్యంగానే జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని లలిత్ మోదీ వీడయోలో వెల్లడించారు.
ఈడీ ఆరోపణలకు ట్రైబ్యునల్ చెక్
2009లో సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్ను భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు తరలించారు. ఈ సందర్భంగా విదేశీ మారక ద్రవ్య లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ప్రారంభించింది. ఐపీఎల్ నిర్వహణ కోసం విదేశాలకు పంపిన నిధులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ముందస్తు అనుమతి అవసరమని ఈడీ ఆరోపించింది. విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించారంటూ లలిత్ మోదీతో పాటు మరికొందరిపై కేసులు పెట్టింది. లలిత్ మోదీకి రూ.10.65 కోట్ల జరిమానా విధించింది. తాజా విచారణలో అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: రోహిత్ శర్మ జోరు.. అగ్రస్థానానికి అడుగు దూరంలో గిల్
డ్రంకెన్ డ్రైవ్ కేసు.. డేవిడ్ వార్నర్ను దోషిగా తేల్చిన కోర్టు