ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త మైలురాయి.. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్గా ఆర్సీబీ
ABN , Publish Date - Jul 29 , 2026 | 05:53 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది. యూఎస్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘హౌలిహాన్ లోకీ’ విడుదల చేసిన ‘2026 ఐపీఎల్ వాల్యుయేషన్ స్టడీ’ అనే నివేదిక ప్రకారం ఆర్సీబీ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగి 312 మిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు ఐపీఎల్ మొత్తం వ్యాపార విలువ తొలిసారి 20.6 బిలియన్ డాలర్లకు చేరి మరో మైలురాయిని అందుకుంది.
2026 సీజన్లో ఐపీఎల్తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్ టైటిళ్లను గెలవడం, భారీగా అభిమానులు, బలమైన వాణిజ్య ఒప్పందాలు ఆర్సీబీ విలువ పెరగడానికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ముంబయి ఇండియన్స్ 264 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ 245 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచింది. ధోని లేకపోవడం, ఈ సీజన్లో వరుస పరాజయాలు చవి చూడటం వల్ల చెన్నై సూపర్ కింగ్స్ 244 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, జీటీ, ఢిల్లీ క్యాపిటల్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
నివేదిక ప్రకారం 2023లో 15.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఐపీఎల్ బ్రాండ్ విలువ.. 2024లో 16.4 బిలియన్ డాలర్లు, 2025లో 18.5 బిలియన్ డాలర్లకు పెరిగి, ఇప్పుడు 20.6 బిలియన్ డాలర్లను చేరుకుంది. మీడియా హక్కులు, స్పాన్సర్షిప్లు, టికెట్ విక్రయాలతో కలిపి 2026 సీజన్ ఆదాయం 1.8 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. 2028 నుంచి అమల్లోకి వచ్చే కొత్త మీడియా హక్కుల ఒప్పందం ద్వారా ఐపీఎల్ విలువ మరింత పెరిగే అవకాశముందని నివేదిక స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
వన్డే ప్రపంచ కప్ 2027: స్క్వాడ్ సైజ్ను పెంచండి.. ఐసీసీకి ఆసీస్ కోచ్ విజ్ఞప్తి
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో సంచలనం.. అసలేంటీ ‘క్లికీ పాంటింగ్’ వివాదం?