Share News

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

ABN , Publish Date - Jul 29 , 2026 | 03:06 PM

భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్
ICC Rankings

ఇంటర్నెట్ డెస్క్: వన్డే, టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్(801).. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌(794)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మూడు, నాలుగు స్థానాల్లో భారత వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ(767), రోహిత్ శర్మ(758) కొనసాగుతున్నారు.


వైభవ్ విధ్వంసం!

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ సిక్సర్ల పిడుగు.. జింబాబ్వేపై వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో ఏకంగా 230 స్థానాలు ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జింబాబ్వేతో సిరీస్‌లో మొత్తం 151 పరుగులు చేసిన ఈ 15 ఏళ్ల కుర్రాడు.. 278వ స్థానం నుంచి నేరుగా 48వ స్థానానికి దూసుకొచ్చాడు. టీ20 బ్యాటర్ల జాబితాలో ఇషాన్ కిషన్ 910 రేటింగ్ పాయింట్లతో నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకోగా, పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. జింబాబ్వే పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు. జింబాబ్వే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన తిలక్ వర్మ(750) ఆరో స్థానానికి చేరుకున్నాడు.


బౌలింగ్ విభాగంలో..

వన్డే బౌలింగ్ జాబితాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ 15 జాబితాలో భారత బౌలర్లలో కేవలం కుల్‌దీప్ యాదవ్ చోటు దక్కించుకోవడం గమనార్హం. 596 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 బౌలింగ్ జాబితాలో.. గాయంతో జింబాబ్వే సిరీస్‌కు దూరమైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. ఇదిలా ఉంటే, జింబాబ్వేపై సిరీస్ విజయం సాధించిన భారత్ వన్డే, టీ20ల్లో ప్రపంచ నంబర్-1 జట్టుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టీ20ల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలో 268 రేటింగ్ పాయింట్లతో సమానంగా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ చెత్త రికార్డు.. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో పరాజయం

కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..

Updated Date - Jul 29 , 2026 | 03:08 PM