కామన్వెల్త్ గేమ్స్లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..
ABN , Publish Date - Jul 29 , 2026 | 09:54 AM
కామన్వెల్త్ గేమ్స్2026లో భారత అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చరిత్రాత్మక విజయం సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగుపందెంలో రజత పతకం సాధించాడు. దీంతో ఈ విభాగంలో రజతం సాధించిన తొలి భారత పురుష అథ్లెట్గా రికార్డులకెక్కారు. జాతీయ రికార్డు హోల్డరైన గుల్వీర్.. స్కాట్స్టౌన్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ రేసును 27:49.8 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ స్వర్గ పతకం కైవసం చేసుకోగా.. ఐల్ ఆఫ్ మ్యాన్కు చెందిన డేవిడ్ ముల్లార్కీ కాంస్యం దక్కించుకున్నాడు.
గ్లాస్గోలో కురుస్తున్న వర్షాన్ని లెక్కచేయకుండా, అగ్రశేణి ఆఫ్రికన్ రన్నర్లతో పోటీ పడుతూ గుల్వీర్ అత్యంత వ్యూహాత్మకంగా రేసును సాగించాడు. తొలుత అగ్రస్థానాల కోసం పోటీపడిన ఆయన, రేసు మధ్యలో కొంత వెనుకబడినప్పటికీ పట్టుసడలించలేదు. చివరి 1000 మీటర్ల దూరం ఉన్నప్పుడు అద్భుతమైన వేగాన్ని ప్రదర్శించి ప్రత్యర్థులను వెనక్కి నెట్టాడు. చివరి క్షణంలో అదిరిపోయే కిక్తో పరుగును ముగించి రజతం సొంతం చేసుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో 1986 తర్వాత ఆఫ్రికేతర ఆటగాడు పోడియంపై నిలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇది 2022 ఎడిషన్లో అవినాష్ సాబ్లే సాధించిన పతక విజయాలను గుర్తుచేసింది. భారత్ తరఫున అంతకుముందు 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో కవితా రౌత్ మహిళల విభాగంలో కాంస్యం నెగ్గగా, ఇప్పుడు పురుషుల విభాగంలో గుల్వీర్ సింగ్ ఈ చారిత్రక మైలురాయిని తాకి దేశం గర్వపడేలా చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఆ మాటలు వైభవ్ను అవమానించినట్లు కాదు: రవిచంద్ర అశ్విన్
భారత క్రికెట్ జట్టుకు గుడ్బై చెప్పిన గంభీర్ స్నేహితుడు