భారత క్రికెట్ జట్టుకు గుడ్బై చెప్పిన గంభీర్ స్నేహితుడు
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:00 AM
భారత్ క్రికెట్ జట్టు సిబ్బంది బృందంలో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. సహాయక కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ల కాంట్రాక్టులను పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
స్పోర్ట్ డెస్క్: భారత్ క్రికెట్ జట్టు సిబ్బంది బృందంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. సహాయక కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ల కాంట్రాక్టులను పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. జూన్ 10వ తేదీతో వీరిద్దరీ కాంట్రాక్ట్ గడువు పూర్తయిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. వారి ఒప్పందాలను ఇకపై కొనసాగించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించడం లేదని తెలిపారు.
గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో భాగంగా 2024లో టీమిండియాలో చేరిన ర్యాన్ టెన్ రెండేళ్ల పాటు సేవలందించారు. అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ర్యాన్ టెన్ టీమిండియాకు గుడ్ బై చెప్పనున్నాడని తెలుస్తోంది. భారత జట్టు నుంచి వైదొలిగిన అనంతరం ర్యాన్ టెన్ తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ కోచింగ్ బృందంలో చేరే అవకాశం ఉందని సమాచారం. ర్యాన్ టెన్.. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్కు చాలా క్లోజ్ ఫ్రెండ్.
వీరిద్దరికి ఐపీఎల్లో కేకేఆర్కు ఆడిన రోజుల్లో పరిచయం ఏర్పడి... మంచి స్నేహితులుగా మారారు. అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగుతూ వచ్చింది. గంభీర్ కారణంగానే భారత్ క్రికెట్ జట్టు సహయ సిబ్బందిలో ర్యాన్ టెన్ చేరడాని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరగనున్న శ్రీలంక పర్యటనకు ముందే కొత్త ఫీల్డింగ్ కోచ్ను ఖరారు చేయాలని బోర్డు భావిస్తోంది. ఈ పదవికి అస్సాంకు చెందిన మాజీ క్రికెటర్ సుభదీప్ ఘోష్ పేరు ముందంజలో ఉన్నట్లు సమాచారం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేస్తున్న ఘోష్.. ఇండియా 'ఎ', అండర్-19, అలాగే భారత మహిళల జట్లతో పనిచేస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చెందిన కొంతమంది కోచ్లు, మాజీ క్రికెటర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు