అంతర్జాతీయ క్రికెట్లో సూర్యవంశీ సంచలనం.. తొలి ప్లేయర్గా రికార్డ్
ABN , Publish Date - Jul 27 , 2026 | 07:47 AM
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో వైభవ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటిన వైభవ్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: జింబాబ్వే పర్యటనలో భారత్ టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. నిన్న(ఆదివారం) జరిగిన చివరి టీ20లో 35 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ హాఫ్(81) సెంచరీతో సత్తాచాటాడు. అతడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ఈ సిరీస్లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల వయస్సు లోపే ఒకటి కంటే ఎక్కువ అర్ధ శతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు నేపాల్కు చెందిన కుశాల్ మల్లా పేరిట ఉండగా.. తాజాగా వైభవ్ బ్రేక్ చేశాడు. తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, టీ20 క్రికెట్లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా నిలిచాడు.
ఓవరాల్గా టీ20 క్రికెట్లో వైభవ్ ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 86 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు కూడా ఈ ఏడాది ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. కానీ, ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు కొట్టిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. అతడు 2025లో 108 సిక్సర్లు బాదాడు. రాబోయే రోజుల్లో వైభవ్ ఈ రికార్డును దాటేసే అవకాశముంది. మరోవైపు మూడో టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్తో వైభవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. 'తొలిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది' అని మ్యాచ్ అనంతరం వైభవ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్