Share News

బంగారు చాను

ABN , Publish Date - Jul 27 , 2026 | 04:00 AM

స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను.. కామన్వెల్త్‌ క్రీడల్లో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల 48 కిలోల విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్‌ చాంప్‌ చాను..

బంగారు చాను

నేటి భారత షెడ్యూల్‌

అథ్లెటిక్స్‌, పారా అథ్లెటిక్స్‌: మహిళల హైజంప్‌ క్వాలిఫికేషన్‌- పూజా సింగ్‌ (మ. 2.30), పురుషుల 400 మీ. హర్డిల్స్‌ రౌండ్‌-1 యశస్‌, సంతోష్‌ (మ. 2.40), లాంగ్‌ జంప్‌ క్వాలిఫికేషన్‌- మురళీ శంకర్‌, లోకేష్‌ (మ. 3), పురుషుల 100 మీ. రౌండ్‌-1 హీట్‌-4 గుర్వీందర్‌ (మ. 3.10), పురుషుల 110 మీ. హర్డిల్స్‌ రౌండ్‌-1- తేజస్‌ (సా. 4.30), పారా షాట్‌పుట్‌- షర్మిల, శిల్ప (రా. 11.35), హైజంప్‌ ఫైనల్‌- సర్వేశ్‌, తేజస్విన్‌ శంకర్‌, ఆదర్శ్‌ రామ్‌ (రా. 11.40).

స్విమ్మింగ్‌: పురుషుల 200 మీ. బటర్‌ఫ్లై హీట్‌-2-సజన్‌ ప్రకాశ్‌ (మ. 3), పురుషుల పారా 100 మీ. బ్రెస్ట్‌ స్ట్రోక్‌ హీట్‌-2- సాత్విక్‌ (సా. 4.26), పురుషుల 800 మీ. ఫ్రీస్టయిల్‌- ఆర్యన్‌ (రా. 1).

బాక్సింగ్‌: పురుషుల 60 కిలోల రౌండ్‌-16- సచిన్‌ (సా. 4.45), పురుషుల 80 కిలోలు- అంకుష్‌ (సా. 6), మహిళల 51 కి-సాక్షి చౌదరి (రా.10.30), పురుషుల 70 కి-సుమీత్‌ (రా. 1).

జిమ్నాస్టిక్స్‌: వాల్ట్‌ ఫైనల్‌- సమంత(సా. 6.15)

వెయిట్‌ లిఫ్టింగ్‌: మహిళల 53 కిలోలు-జ్ఞానేశ్వరి (సా. 5.45), 58 కి- బింద్యా రాణి (రా. 8), పురుషుల 79 కి-అజయ్‌ బాబు (రా. 12.45).

  • వెయిట్‌లిఫ్టింగ్‌లో రికార్డు

  • ప్రదర్శనతో మీరాబాయి చానుకు స్వర్ణం

  • కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో తొలి పసిడి

  • మరో లిఫ్టర్‌ రిషికాంత్‌కు రజతం

గ్లాస్గో: స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను.. కామన్వెల్త్‌ క్రీడల్లో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల 48 కిలోల విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్‌ చాంప్‌ చాను.. రికార్డు ప్రదర్శనతో పసిడి పట్టేసింది. మీరాకు ఇది వరుసగా మూడో కామన్వెల్త్‌ స్వర్ణం. 2018, 2022 క్రీడల్లోనూ ఆమె పసిడి పతకాలను ముద్దాడింది. రెజ్లర్లు సుశీల్‌ కుమార్‌ (2010, 2014, 2018), వినేశ్‌ ఫొగట్‌ (2014, 2018, 2022) తర్వాత కామన్వెల్త్‌ క్రీడల్లో హ్యాట్రిక్‌ స్వర్ణాలు నెగ్గిన భారత అథ్లెట్‌గా మీరా చరిత్ర సృష్టించింది. ఇక పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 60 కిలోల విభాగంలో రిషికాంత సింగ్‌ రజతం సాధించాడు. దీంతో క్రీడలకు నాలుగో రోజైన ఆదివారం భారత్‌కు 2 పతకాలు లభించాయి. ఓవరాల్‌గా భారత్‌ ఖాతాలో మొత్తం 3 పతకాలు చేరాయి. శనివారం పారాలిఫ్టర్‌ ఝండూ కుమార్‌ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.

మీరా రికార్డు ప్రదర్శన: ఒలింపిక్‌ పతక విజేత మీరాబాయి మొత్తంగా 190 (స్నాచ్‌లో 85 కి.+ క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 105 కి) కిలోలు ఎత్తి రికార్డు ప్రదర్శనతో బంగారు పతకాన్ని సొంతం చేసుకొంది. తొలుత స్నాచ్‌లో 85 కిలోలు ఎత్తి కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డు నెలకొల్పింది. ఇక.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లోనూ సత్తా చాటుతూ 105 కిలోల బరువు ఎత్తి కామన్వెల్త్‌ గేమ్స్‌ పరంగా సరికొత్త రికార్డు సాధించింది. నైజీరియా లిఫ్టర్‌ రుస్త్‌ ఎన్‌యోంగ్‌ 168 (75+93) కిలోలతో రజతం, మలేసియాకు చెందిన ఇరిన్‌ జేన్‌ 167 (77+90) కిలోలతో కాంస్యం నెగ్గారు.


రిషికాంత చేజారిన పసిడి: గాయంతో ఇబ్బంది పడుతున్నా కూడా అద్భుత పోరాటంతో రిషికాంత సింగ్‌ పతకం నెగ్గడం విశేషం. అతను 60 కిలోల విభాగంలో మొత్తం 264 (121+143) కిలోల బరువుఎత్తి రెండో స్థానంతో రజతం అందుకున్నాడు. స్నాచ్‌లో 121 కిలోలు లిఫ్ట్‌ చేసి నయా గేమ్స్‌ రికార్డు నెలకొల్పిన

రిషికాంత.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 143 కిలోలు ఎత్తాడు. మలేసియా లిఫ్టర్‌ మహ్మద్‌ అనిక్‌ 273 (121+152) కిలోలతో గేమ్స్‌ రికార్డుతో స్వర్ణం సాధించాడు. కెన్యా లిఫ్టర్‌ జోషువా అముంగ 260 (115+145) కిలోలతో కాంస్యం కైవసం చేసుకున్నాడు.

ఫ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ పురుషుల ఆల్‌రౌండ్‌ ఫైనల్లో తపన్‌ మొహంతి 70.100 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు.

ఇటుకలు మోసిన చేతులు..

రిషికాంత సింగ్‌ది మణిపూర్‌లోని పశ్చిమ ఇంఫాల్‌ జిల్లా. తండ్రి క్యాబ్‌ డ్రైవర్‌. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు నిర్మాణ రంగంలో కూలీగా ఇటుకలు మోశాడు. రాజధాని ఇంఫాల్‌లోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)లో చేరితే శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచితంగా ఆహారం లభిస్తుందని స్థానిక పీఈటీ చెప్పడంతో నిషికాంత ఎగిరి గంతేశాడు. గ్రామం నుంచి రోజూ 40 కి.మీ. దూరంలోని సాయ్‌ సెంటర్‌కు సైకిల్‌పై వెళ్లి శిక్షణ పొందిన నిషికాంత జూనియర్‌గా 2016 జాతీయ చాంపియన్‌షి్‌పలో స్వర్ణ పతకంతో మెరిశాడు. తర్వాత జూనియర్‌ కామన్వెల్త్‌ పోటీల్లో తొలి అంతర్జాతీయ పతకం సాధించాడు. ఆ టోర్నీ తర్వాత ఇంఫాల్‌ సాయ్‌ సెంటర్‌లో నిషికాంత ప్రవేశానికి నో అన్నారు. అది జూనియర్‌ స్థాయి అథ్లెట్లకే పరిమితమని, నిషికాంత ఆ స్థాయిని దాటాడని అధికారులు స్పష్టంజేశారు. దాంతో కుటుంబానికి సాయంగా ఉండేందుకు మళ్లీ కూలీబాట పట్టాడు. అయితే, ఇంఫాల్‌ సమీపంలో కొత్తగా సాయ్‌ సెంటరాఫ్‌ ఎక్స్‌లెన్సీ మొదలవడం నిషికాంతకు వరమైంది. అక్కడ కెరీర్‌ను పునఃప్రారంభించుకున్న అతడు కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్‌ పతాకను రెపరెపలాడించాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


స్విమ్మింగ్‌ రిలేలో ఫైనల్‌కు

పురుషుల స్విమ్మింగ్‌ 4-200 మీటర్ల రిలేలో భారత జట్టు ఫైనల్‌ చేరింది. హీట్స్‌లో దక్షణ్‌, అనీష్‌, ఆర్యన్‌, శ్రీహరిలతో కూడిన బృందం 7 నిమిషాల 39.48 సెకన్లతో మూడోస్థానంలో నిలిచి ఫైనల్‌ చేరింది.

లాన్‌ బౌల్స్‌లో నిరాశ

లాన్‌ బౌల్స్‌లో మహిళల పెయిర్స్‌ సెక్షన్‌-బి నుంచి సెమీస్‌ చేరాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత జోడీ రూపా రాణి-పింకీ సింగ్‌ టైబ్రేక్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది. దీంతో సెక్షన్‌ టాపర్‌గా ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ పట్టేసింది. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-డి నాలుగో రౌండ్‌లో పుతుల్‌ సోనోవాల్‌ 0.5- 1.5తో షాన్‌ జేమ్స్‌ (మల్టా) చేతిలో ఓడాడు. తద్వారా అతడు కూడా సెమీస్‌ రేసు నుంచి అవుటయ్యాడు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

Updated Date - Jul 27 , 2026 | 04:00 AM