రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్కు బిగ్ షాక్!
ABN , Publish Date - May 30 , 2026 | 09:11 PM
ఐపీఎల్ 2026 టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. రేపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ కీలక పోరు జరగనుంది.
స్పోర్ట్ డెస్క్: ఐపీఎల్ 2026 టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. రేపు (మే 31) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ కీలక పోరు జరగనుంది. ఈ క్రమంలోనే వరుసగా రెండో సారి ఐపీఎల్ కప్ను ముద్దాడి సరికొత్త రికార్డు సృష్టించాలని ఆర్సీబీ కసిగా ఉంది. అయితే ఈ మహాసంగ్రామానికి ముందే ఆర్సీబీ అభిమానులకు బెంగళూరు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. నగరంలో బహిరంగంగా ఐపీఎల్ వేడుకలు జరుపుకోవడంపై పూర్తిగా నిషేధం విధిస్తూ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
బెంగళూరు పోలీసులు ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనే ప్రధాన కారణమని సమాచారం. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలిచినప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో స్టేడియం బయట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఏకంగా 11 మంది మరణించారు. ఈ ఘటనకు కారణంగా ఆర్సీబీ యాజమాన్యం వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం అంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావించిన బెంగళూరు పోలీసులు ముందస్తుగానే కఠినమైన ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బెంగళూరు నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్ జామ్లు, అవాంఛనీయ సంఘటనలను అరికట్టడానికి ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలలో సాధారణ ప్రజల కోసం లైవ్ బ్రాడ్కాస్టింగ్ను ఏర్పాటు చేయవద్దని యాజమాన్యాలను కోరారు. అలాగే రోడ్లపై బైక్ ర్యాలీలు తీయడం, పటాకులు కాల్చడంపై కూడా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. దీంతో పాటు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, గొడవలకు దిగడం వంటి పనులు చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు గట్టిగా హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
రెజ్లింగ్ ట్రయల్స్లో ఓటమిపాలైన వినేశ్
ఐపీఎల్2026: సన్ రైజర్స్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్