ఫిర్యాదుదారుల కోసం పోలీసులు అందుబాటులో ఉండాలి: డీజీపీ ఆనంద్
ABN , Publish Date - May 30 , 2026 | 08:01 PM
ఫిర్యాదుదారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని డీజీపీ ఆనంద్ పోలీసులకు సూచించారు. సీసీటీఎన్ఎస్ వ్యవస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పాత విధానాలను విడిచిపెట్టి ఆధునిక సాంకేతికతతో ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిర్యాదుదారుల కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని డీజీపీ ఆనంద్ సూచించారు. సీసీటీఎన్ఎస్ (CCTNS) వ్యవస్థ పనితీరు సరిగా లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్పెక్టర్ల నుంచి ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన డీజీపీ, పాత పద్ధతులను విడిచిపెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ అధికారి క్రమశిక్షణతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఎస్ఐబీ విభాగాలను పునర్ వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని డీజీపీ తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణపై ప్రతి అధికారి కట్టుబడి పనిచేయాలని సూచించారు. త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో, ఫుడ్ అడల్ట్రేషన్ వింగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ వెల్లడించారు.
జూనియర్లు సీనియర్లకు గౌరవం ఇవ్వాలని, పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. టెక్నికల్ సేవల కోసం ప్రత్యేకంగా డీజీపీ టెక్ టీమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనర్లు క్రైమ్ రివ్యూ తప్పకుండా నిర్వహించాలని, యూనిట్ హెడ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని డీజీపీ ఆనంద్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..
వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..