పాలకులే హంతకులుగా మారారు.. మేనల్లుడిపై దాడిని ఖండించిన మమత
ABN , Publish Date - May 30 , 2026 | 08:30 PM
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పాలకులు హంతకులుగా మారుతున్నారు. బీజేపీకి ఇది సిగ్గుచేటు' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు.
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పాలకులు హంతకులుగా మారుతున్నారు. బీజేపీకి ఇది సిగ్గుచేటు' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు.
'అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితుడైన సంజు కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇచ్చిన మాటకు అభిషేక్ బెనర్జీ కట్టుబట్టారు. సోనార్పూర్ వెళ్లారు. బీజేపీ దన్నుతో కొందరు దుండగులు మా జాతీయ ప్రధాన కార్యదర్శిపై అమానుషంగా దాడి చేశారు. అయినప్పటికీ ఆయన బీజేపీ గూండాల దాడిలో నష్టపోయిన కుటుంబానికి అండగా నిలిచారు. కనికరంతో కూడిన రాజకీయాలకూ, విద్వేషంతో కూడిన రాజకీయాలకు ఉన్న తేడా ఇదే. సువేందు హయాంలో చోటుచేసుకుంటున్న బెదిరింపులు, హింస, ప్రతీకార రాజకీయాలు మరోసారి ఇవాళ బహిర్గతమయ్యాయి' అని ఆ ట్వీట్లో మమత పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..?
ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో భాదితులను పరామర్శించేందుకు సోనార్పూర్ వెళ్లిన అభిషేక్పై స్థానికులు రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. కొందరు ఆయనపై చేయి చేసుకున్నారు. 'దొంగ' అంటూ నినాదాలు చేస్తూ దాడికి దిగారు. ఆ సమయంలో హెల్మెట్ ధరించిన అభిషేక్కు భద్రతా సిబ్బంది రక్షణగా నిలిచారు. కాగా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిపారని, తనను చంపేందుకు ప్రయత్నించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. దాడి సమయంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదన్నారు. తనపై జరిగిన దాడిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఘటన అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం కోల్కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే