టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే
ABN , Publish Date - May 30 , 2026 | 08:03 PM
పశ్చిమబెంగాల్లోని సోనార్పూర్లో శనివారం టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణం కనిపిస్తోందని సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: సోనార్పూర్లో (పశ్చిమబెంగాల్) టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం జరిగిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. రాజకీయ భేదాభిప్రాయాలున్నంత మాత్రాన హింసకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు టీఎంసీ ఎంపీ శనివారం సోనార్పూర్ వెళ్లిన సందర్భంగా కొందరు కోడి గుడ్లు, రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ దాడిని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎక్స్ వేదికగా ఖండించారు. ఆయనకు తగినంత పోలీసు భద్రత లేకపోవడాన్ని బట్టి బీజేపీ రాజకీయాలు, ప్రతీకారాలను అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతిపక్ష నేతల భద్రత కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా అభిషేక్ బెనర్జీపై దాడిని ఖండించారు. తాము ఎంతటి ద్వేషపూరిత రాజకీయాలకైనా దిగగలమని బీజేపీ ఈ దాడితో రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. సున్నిత ప్రాంతాల్లో కూడా పోలీసు భద్రత లేకపోవడం కుట్ర కోణాన్ని సూచిస్తోందని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. బీజేపీ కార్యకర్తలే అభిషేక్ బెనర్జీపై దాడికి దిగారని టీఎంసీ ఆరోపించింది.
ఈ వార్తలనూ చదవండి:
డీకే ప్రమాణస్వీకారం తేదీ ఖరారు.. ప్రకటించిన కేసీ వేణుగోపాల్
ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం... ఆర్మీ చీఫ్ ద్వివేది