Share News

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి

ABN , Publish Date - May 30 , 2026 | 05:56 PM

సోనార్‌పూర్‌ పర్యటనకు వెళ్లిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో, భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
Abhishek Banerjee

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. సోనార్‌పూర్‌కు వెళ్లిన ఆయనపై కొందరు రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు. మరికొందరు దొంగా..దొంగా.. అంటూ బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, సెక్యూరిటీ సిబ్బంది ఆయనను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లిపోయారు.

ఈ ఘటనపై అభిషేక్ బెనర్జీ స్పందించారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ‘వాళ్ల దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇదే. ఎన్నికలు పూర్తై నెల కూడా కాలేదు. పోలీసులు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించట్లేదు’ అని మీడియాతో అన్నారు. తాను సోనార్‌పూర్‌కు వస్తున్నట్టు ముందే సమాచారం ఇచ్చినా అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదని అరోపించారు. పోలీసులు, ఇతర భద్రతా దళాలు ఇక్కడకు వచ్చే వరకూ తాను అంగుళం కూడా కదిలేదిలేదని చెప్పారు.


స్థానిక రోడ్లు, ఇతర మౌలిక వసతులు సరిగా లేవని కొందరు నిరసనకు దిగినట్టు తెలుస్తోంది. వానాకాలంలో రోడ్లు జలమయం అయ్యి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని, మంచినీటి సరఫరాను మెరుగు పరచాలని తాము గతంలో ఎన్నిసార్లు అభ్యర్థించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని చెప్పారు. టీఎంసీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నా తమ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.


ఈ వార్తలనూ చదవండి:

సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

సాంకేతిక సమస్యతో సీయూఈటీ పరీక్ష ఆలస్యంగా మొదలు! ప్రతిపక్షాల విమర్శలు

Updated Date - May 30 , 2026 | 06:31 PM