ఐపీఎల్2026: చరిత్ర సృష్టించిన రోహిత్
ABN , Publish Date - Apr 13 , 2026 | 10:38 AM
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక మైలురాయిని తాకాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ముంబై తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ముంబై తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్న (ఆదివారం) వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ ఈ ఘనత సాధించాడు.
ఆర్సీబీతో మ్యాచ్కు ముందు ఆరు వేల పరుగుల మైలు రాయిని చేరుకునేందుకు రోహిత్కు 6 పరుగులు కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్లో జేకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో పుల్ షాట్తో సిక్సర్ కొట్టి ఈ మైలురాయిని సాధించాడు. 231 ఇన్నింగ్స్లో రోహిత్ ఈ ఫీట్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 13 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసి.. తొడ కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
ఐపీఎల్లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు
రోహిత్ శర్మ- 6002
సూర్యకుమార్ యాదవ్- 3776
కీరన్ పొలార్డ్- 3412
అంబటి రాయుడు- 2416
సచిన్ టెండూల్కర్- 2334
ఐపీఎల్లో ఒకే జట్టుకు అత్యధిక పరుగులు చేసిన రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అతడు ఆర్సీబీ తరఫున 271 మ్యాచ్ల్లో 8840 పరుగులు చేశాడు. ఐపీఎల్, ఛాంపియన్ లీగ్ కలిపి 9264 పరుగులు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 222 పరుగుల మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ తరఫున ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇవి కూడా చదవండి:
టైటాన్స్.. సులువుగా.. అదరగొట్టిన ప్రసిద్ధ్