ఐసీసీ పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:29 PM
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి వైదొలిగారు. ఐసీసీ జనరల్ మేనేజర్ పదవికి గుడ్బై చెప్పేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవిని వీడారు.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాజీ సీఈవో వాసిమ్ ఖాన్(Wasim Khan) అంతర్జాతీయ క్రికెట్ మండలిలో కీలక పదవి నుంచి వైదొలిగారు. ఐసీసీ జనరల్ మేనేజర్ పదవికి ఆయన గుడ్బై చెప్పేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఆ పదవిని వీడారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి వాసిమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు ఆయన పీసీబీ సీఈవోగా మూడేళ్లు పనిచేశారు. ఇప్పుడు ఐసీసీ జనరల్ మేనేజర్ పదవి నుంచి వైదొలిగినా.. జూన్ నెలాఖరులో మరో పదవీ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
గత రెండేళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC)లో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. వివిధ కారణాలతో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులు తమ పదవులను వీడుతున్నారు. అల్లార్డెస్తో పాటు యాంటీ కరప్షన్ యూనిట్కు చెందిన క్రిస్ టెట్లీ(ఈవెంట్స్ హెడ్), అలెక్స్ మార్షల్ తమ పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానంలో గౌరవ్ సక్సేనా, ఆండ్రూ వచ్చి చేరారు. ఇప్పుడు వాసిమ్ఖాన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
పాక్ క్రికెట్ బోర్డులో కీలక బాధ్యతలు చేపట్టిన వాసిమ్ ఇంగ్లాండ్లో జన్మించడం గమనార్హం. అక్కడే తన క్రికెట్ కెరీర్ను మొదలుపెట్టాడు. వసీం ఖాన్1995 నుంచి 2001 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్లో, 1998 నుంచి 2002 వరకు లిస్ట్-ఎ మ్యాచ్ల్లో ఆడాడు. 1995లో వార్విక్షైర్ కౌంటీ టైటిల్ గెలుచుకున్న జట్టులో అతను సభ్యుడిగా ఉన్నారు. పాకిస్థాన్ మూలాలు ఉన్నప్పటికీ.. పాక్ జట్టు తరఫున ఒక్క మ్యాచూ ఆడలేదు. కానీ, పీసీబీకి సీఈవోగా పనిచేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
డేంజరస్ పిచ్.. అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు