పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. ప్రధాని మోదీ ట్వీట్..
ABN , Publish Date - Apr 22 , 2026 | 09:19 AM
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాదుల చేతిలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉగ్రవాదానికి భారతదేశం ఎన్నటికీ తలొగ్గదని హెచ్చరించారు. ఇలాంటి హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ ట్వీట్..
'గతేడాది ఇదే రోజున జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నా. వారిని ఎన్నటికీ మరచిపోలేము. ఈ నష్టం నుంచి కోలుకుంటున్న మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఒక దేశంగా మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా నిలబడ్డాం. భారతదేశం ఏ రూపంలోనూ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావు' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి..
గతేడాది ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఓ స్థానికుడు సహా 25 మందిని దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో మే 7న భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి పాకిస్థాన్కి గట్టి జవాబు ఇచ్చింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ మహదేవ్ పేరుతో మరో ఆపరేషన్ చేపట్టి ఈ కాల్పులకు తెగపడిన ఉగ్రవాదులను పాకిస్థాన్ చేరుకోక ముందే హతమార్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎరువుల ఉత్పత్తిలో 25 శాతం మేర పతనం
ఖర్గే వ్యాఖ్యలు.. ప్రజలను అవమానించడమే