పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. భారత్కు అంతర్జాతీయ సమాజం బాసట
ABN , Publish Date - Apr 22 , 2026 | 10:58 AM
పహల్గామ్లో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారత్లోని వివిధ దేశాల రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులు దేశ ప్రజలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మృతులకు నివాళులర్పిస్తూ, ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 : జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారత్లోని వివిధ దేశాల రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులు భారత్కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మృతులకు ఘన నివాళులర్పిస్తూ, ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్య రాయబారుల స్పందన:
ఇజ్రాయెల్ రాయబారి: రూవెన్ అజార్
ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఒక వీడియో సందేశం ద్వారా పహల్గామ్ బాధితులకు నివాళులర్పించారు. ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, 26 మంది అమాయక ప్రాణాలు బలిగొన్న ఆ దాడి అమానుషమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడులను గుర్తు చేస్తూ, ఈ బాధ మాకు బాగా తెలుసునని ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో న్యూఢిల్లీ, జెరూసలేం కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు.
అర్జెంటీనా రాయబారి: మరియానో కాసినో
అర్జెంటీనా రాయబారి మరియానో కాసినో, పహల్గామ్ మృతుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటూ, అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధితులను భారతదేశం ఎన్నటికీ మరచిపోదని ఆయన పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా హైకమిషనర్: ఫిలిప్ గ్రీన్
ఆస్ట్రేలియా అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకమని ఫిలిప్ గ్రీన్ స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో ఆస్ట్రేలియా తన భారతీయ మిత్రుల పక్కన నిలబడుతుందని ధైర్యం చెప్పారు.
దక్షిణ కొరియా ప్రతినిధి: క్యుంగ్హూన్ కిమ్
కొరియా ఇన్స్టిట్యూట్ ప్రతినిధి కిమ్ మాట్లాడుతూ, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే వారిని, ప్లాన్ చేసే వారిని వెంటనే న్యాయస్థానం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. 'ఇండియా-ఆర్ఓకె' భాగస్వామ్యం ద్వారా ఉగ్రవాద సురక్షిత స్థావరాలను నిర్మూలిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
డ్రైవర్ హత్య కేసులో సాక్షులకు బెదరింపులు.. అనంత బాబు కోసం పోలీసుల గాలింపు
మద్యం మత్తులో తల్లితో గొడవ.. అడ్డుకోబోయిన తండ్రిని
Read Latest Telangana News And Telugu News