జులన్ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:57 AM
భారత్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించారు. అంతేకాక టీమిండియా మాజీ పేసర్ జులన్ గోస్వామి రికార్డును దీప్తి శర్మ సమం చేసింది. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా మహిళల జట్టు దుమ్మురేపుతుంది. పాకిస్థాన్పై విజయంతో ఈ టోర్నీలో తమ ప్రయాణాన్ని ప్రారంభించిన 'విమెన్ ఇన్ బ్లూ', ఆ తర్వాత నెదర్లాండ్స్పై కూడా గెలిచి తమ విజయ పరంపరను కొనసాగించింది. డచ్ దేశంపై 95 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జట్టు విజయంలో స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలక పాత్ర పోషించింది. ఆమె రెండు బంతుల్లో 10 పరుగులు చేసింది. బౌలింగ్లో మూడు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టింది.
ఈ మ్యాచ్లో ఒక వికెట్ సాధించిన దీప్తి శర్మ... సీనియర్ పేసర్ జులన్ గోస్వామి రికార్డును సమం చేసింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో జులన్ గోస్వామి(355 వికెట్లు) అగ్రస్థానంలో ఉంది. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ సాధించడంతో దీప్తి శర్మ ఖాతాలో కూడా 355 వికెట్లు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో చెరో 355 వికెట్లతో జులాన్ గోస్వామి, దీప్తి శర్మ సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్కు ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆ తర్వాత 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు భారత బౌలర్ల దాటికి17.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించింది. అలానే షఫాలీ వర్మ 3, నందిని శర్మ 2 , దీప్తి శర్మ 1 వికెట్ సాధించారు.
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు
355 - ఝులన్ గోస్వామి (భారత్)
355 - దీప్తి శర్మ (భారత్)
335 - కేథరీన్ సైవర్-బ్రంట్ (ఇంగ్లండ్)
332 - ఎల్లీస్ పెల్లీ (ఆస్ట్రేలియా)
327 - సోఫీ ఎక్లెస్టోన్ ( ఇంగ్లండ్)
318 - షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)
ఇవి కూడా చదవండి:
సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్.. వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!
డబుల్ సెంచరీ మిస్ కావడంపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు