జట్టును వీడిన కోచ్లు ర్యాన్ టెన్, దిలీప్.. బీసీసీఐ స్పెషల్ మెసేజ్
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:47 AM
భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ సేవలకు బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ సేవలకు బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఇద్దరి కాంట్రాక్ట్లు ముగియడంతో ఇంగ్లండ్ పర్యటన అనంతరం ర్యాన్, దిలీప్ జట్టును వీడిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరి కాంట్రాక్ట్లను పొడిగించకూడదని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలో వారి భవిష్యత్తు ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపింది.
‘టీమిండియా విజయాల్లో మీ అంకితభావం, కృషి ఎంతో కీలకం. జట్టు కోసం మీరు చేసిన సేవలు చిరస్మరణీయం. మీ కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అని బీసీసీఐ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గతంలోనే స్పష్టత ఇచ్చారు. ‘టి. దిలీప్ కాంట్రాక్టును గత ఏడాది ఒక సంవత్సరం పాటు పొడిగించాం. ర్యాన్ టెన్ ఒప్పందం జూన్ 10తో ముగిసింది. అయితే ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఇద్దరూ జట్టును వీడుతారు. వారి కాంట్రాక్టులను పొడిగించడం లేదు. త్వరలోనే కొత్త కోచ్లను నియమిస్తాం’ అని తెలిపారు.
టి. దిలీప్ 2021 నుంచి భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా పనిచేశారు. ఆయన హయాంలో భారత జట్టు ఫీల్డింగ్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ప్రారంభించిన ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’ మెడల్ కార్యక్రమం అభిమానుల్లో విశేష ఆదరణ పొందింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులు ఈ అవార్డ్ అందుకున్నారు.
మరోవైపు నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్ ర్యాన్ టెన్.. రాహుల్ ద్రవిడ్ తర్వాత ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో చేరారు. ఆయన ఉన్న సమయంలో భారత్ 2025 ఆసియా కప్ను గెలవడంతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ టైటిల్ను నిలబెట్టుకుంది. అయితే టెస్టుల్లో మాత్రం ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పరాజయం, స్వదేశంలో న్యూజిలాండ్ (0-3), దక్షిణాఫ్రికా (0-2) చేతిలో సిరీస్ ఓటములను ఎదుర్కొంది. ఇక ర్యాన్ టెన్ ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్రైడర్స్లో ‘హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ’గా బాధ్యతలు స్వీకరించారు. కాగా కొత్త ఫీల్డింగ్ కోచ్గా శుభదీప్ ఘోష్ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు
రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్