Share News

వన్డే వరల్డ్ కప్ 2027: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే!

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:24 PM

వన్డే ప్రపంచ కప్ 2027లో భారత జట్టు కూర్పు గురించి కొంతకాలంగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రో-కో భవితవ్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వన్డే వరల్డ్ కప్ 2027: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే!
BCCI

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2027లో భారత జట్టు కూర్పు గురించి కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. యువ ప్లేయర్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్న మేనేజ్‌మెంట్.. రో-కోను పరిగణనలోకి తీసుకుంటుందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో రో-కో భవితవ్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు భవిష్యత్తు ప్రణాళికలు, ఆటగాళ్ల ఎంపికపై జరుగుతున్న చర్చలు పూర్తిగా అంతర్గత వ్యవహారాలని స్పష్టం చేశారు.


‘మాకు సమర్థవంతమైన నిపుణుల బృందం ఉంది. ప్రతి నిర్ణయంలో సంబంధిత వర్గాల అభిప్రాయాలు తీసుకుంటాం. జట్టు భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రత్యేక సమావేశాల అవసరం ఇప్పటి వరకు రాలేదు. రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచ కప్‌లో ఆడుతారా? అనే ప్రశ్న చాలా మంది నుంచి ఎదురవుతోంది. అవన్నీ వ్యూహాత్మక చర్చలు. బోర్డు గదుల్లోనే ఉండాల్సిన అంశాలను మీడియాకు చెప్పడం సరైంది కాదు. వారి భవితవ్యం గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. ఆ సమయానికి వారి ఫిట్‌నెస్ సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం’ అని సైకియా వెల్లడించారు.


ప్రభుత్వ నిర్ణయమే కీలకం..

ఐపీఎల్ 2026కి ముందు బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. దాని కారణంగానే టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లా వైదొలిగింది. అప్పటినుంచి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా నిలిచిపోయాయి. ఈ అంశంపై కూడా సైకియా స్పందించారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన భారత జట్టు వైట్‌ బాల్ పర్యటనపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. బీసీసీఐ కేంద్ర ప్రభుత్వ విధానాలకే కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


‘ఇతర దేశాల రాజకీయ పరిస్థితులతో బీసీసీఐకి సంబంధం లేదు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ క్రీడా పోటీల విషయంలో భారత ప్రభుత్వం రూపొందించే విధానాలనే మేము అనుసరిస్తాం. ఏ దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉందనేది మా పరిధిలోని విషయం కాదు. మా పని క్రికెట్ నిర్వహణ మాత్రమే’ అని సైకియా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ రాణిస్తే టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవనం

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

Updated Date - Jun 19 , 2026 | 04:47 PM