Share News

టీమిండియాకు కోచ్ అవసరం లేదు.. గంభీర్‌పై శ్రీశాంత్ విమర్శలు

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:05 PM

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తీవ్ర విమర్శలు చేశాడు. భారత జట్టుకు కోచ్ అవసరం లేదని.. ధోని లాంటి ఒక మంచి మెంటార్ కావాలని అభిప్రాయపడ్డాడు.

టీమిండియాకు కోచ్ అవసరం లేదు.. గంభీర్‌పై శ్రీశాంత్ విమర్శలు
Sreesanth

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై కొంతకాలంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. అతడి నేతృత్వంలోని టీమిండియా స్వదేశంలోనే టెస్టు సిరీస్‌లు ఓడిపోయింది. గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే జట్టుకు ఓటములు ఎదురవుతున్నాయంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్.. గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. భారత జట్టుకు కోచ్ అవసరం లేదని.. ఒక మంచి మెంటార్ కావాలని అభిప్రాయపడ్డాడు.


‘టీమిండియా ఇటీవల ఎదుర్కొన్న వైఫల్యాలన్నీ గంభీర్ హయాంలోనే వచ్చాయి. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో 0-3 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్, సౌతాఫ్రికాపై మరో సిరీస్ ఓటమి, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడం వంటి వాటికి గంభీర్ నిర్ణయాలే కారణం. భారత్‌కు కోచ్ అవసరం లేదు.. ధోని లాంటి ఒక మంచి మెంటార్ కావాలి. గంభీర్ విధానాలతో నేను ఎప్పటికీ ఏకీభవించను. ఆటగాళ్లపై చాలా ఒత్తిడి పెడుతున్నారు. ఈ స్థాయిలో ఉన్న క్రికెటర్లకు మార్గ నిర్దేశం చేయాలి కానీ భయపెట్టకూడదు’ అని శ్రీశాంత్ వెల్లడించాడు.


అదే ధోని ప్రత్యేకత..

‘ధోని ఎప్పుడూ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టడం చూడలేదు. విఫలమైన వెంటనే ప్లేయర్లను పక్కన పెట్టే సంస్కృతి అతడి వద్ద లేదు. ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపడం, స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించడం ధోని ప్రత్యేకత. ముందు ఒక సోదరుడిలా ఉండాలి. గెలిస్తే నవ్వి, ఓడితే కోప్పడటం సరికాదు. జట్టుకు ధోని లాంటి మెంటార్ అవసరం. టీ20 ప్రపంచ కప్ విజయంలో గంభీర్‌కు అతిగా క్రెడిట్ ఇస్తున్నారు. కానీ మైదానంలో ఆటగాళ్లే ప్రదర్శన చేశారు. సరైన సమయంలో పక్కాగా నిర్ణయాలు తీసుకున్న వారే విజయానికి కారణం అవుతారు’ అని శ్రీశాంత్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ రాణిస్తే టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవనం

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

Updated Date - Jun 19 , 2026 | 03:09 PM