నవ్వుల నవాబులు
ABN , Publish Date - May 03 , 2026 | 10:53 AM
జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య చిరునవ్వు మాయం అవుతోంది. కాసేపు నవ్వుకు నేందుకు కామెడీ ట్రాకులు వెదుక్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు, స్కిట్స్ను దాటి... జీవితంలోని సంఘటనల నుంచే కామెడీని పండిస్తున్నారు ‘స్టాండప్ కమెడియన్స్’.
జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య చిరునవ్వు మాయం అవుతోంది. కాసేపు నవ్వుకు నేందుకు కామెడీ ట్రాకులు వెదుక్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు, స్కిట్స్ను దాటి... జీవితంలోని సంఘటనల నుంచే కామెడీని పండిస్తున్నారు ‘స్టాండప్ కమెడియన్స్’. తారలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం వీరికి అభిమానులుగా మారుతున్నారు. వీళ్లు వేసే జోకులకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్వంటి ఓటీటీ వేదికలతో పాటు... అనేక నగరాల్లో లైవ్ ‘స్టాండప్ కామెడీ షో’లు హౌస్ఫుల్ అవుతు న్నాయి. నేడు (మే మొదటి ఆదివారం) ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’ సందర్భంగా ‘స్టాండప్ కమెడియన్ల’పై కవర్స్టోరీ.
జోకుల జకీర్
జకీర్ఖాన్ చెప్పే జోకులకు సినిమా స్టార్లు కూడా పడీ పడీ నవ్వుతారు. అందుకే అతడిని సినిమా ఫంక్షన్లకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ‘స్ర్కీన్ అవార్డు’ ఫంక్షన్లో జకీర్ఖాన్ సెంటరాఫ్ అట్రాక్షన్గా మారాడు. స్టాండప్ కమెడియన్గా అతడు పేల్చిన జోకులకు ఆహూతులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. 14 ఏళ్ల క్రితం ‘కామెడీ సెంట్రల్’ పోటీ ద్వారా నవ్వుల ప్రపంచానికి పరిచయమైన జకీర్ ‘ఆన్ ఎయిర్ విత్ ఏఐబీ’ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించాడు. ‘హక్ సే సింగిల్’, ‘కక్ష్యా గ్యార్వీ’, ‘తథాస్తు’, ‘డెలులూ ఎక్స్ప్రెస్’ స్టాండప్ స్పెషల్స్ ద్వారా నవ్వులజల్లు కురిపించాడు. ఇండోర్ (మధ్యప్రదేశ్)కు చెందిన ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు ఉస్తాద్ మొయినుద్దీన్ ఖాన్ మనవడే జకీర్ ఖాన్.
ఒకవైపు దిల్లీలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూనే స్టాండప్ కామెడీపై దృష్టి సారించాడు. అతడి యూట్యూబ్ ఛానెల్కు 70 లక్షల మంది వీక్షకులున్నారు. న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ దగ్గర హిందీలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. వచ్చే నెల నుంచి ‘పాపా యార్’ టూర్తో భారతీయ నగరాల్లో పర్యటించి కామెడీప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
జకీర్ఖాన్ (38)
నవ్వుల వీరుడు...
వీర్దాస్ జోక్ పేలిస్తే భారతీయులే కాదు... చికాగో, మాడిసన్, లండన్, బ్యాంకాక్, హాంకాంగ్, మలేషియా... ఇలా అన్ని దేశాల్లోని ప్రవాస భారతీయలు కూడా కడుపుబ్బా నవ్వాల్సిందే. స్టాండప్ కమెడియన్గా విదేశీ టూర్లు వేయడంలో తెగ బిజీగా ఉంటాడు. మే నెలలో ‘హే స్ట్రేంజర్’ టూర్లో భాగంగా థాయ్లాండ్, హాంకాంగ్, సింగపూర్, కౌలాలంపూర్లో కామెడీ షోలున్నాయి. మరోవైపు ‘సౌండ్స్ ఆఫ్ ఇండియా’ టూర్ దిల్లీ, పుణేల్లో ఉంది. 46 ఏళ్ల వీర్ దాస్ డెహ్రాడూన్ వాసి.
ఇప్పటిదాకా వందకు పైగా స్టాండప్ కామెడీ షోలు చేశాడు. తనకు వచ్చిన పాపులారిటీతో 18 సినిమాల్లో కూడా నటించాడు. వాటిల్లో ‘ఢిల్లీబెల్లీ’, ‘బద్మాష్ కంపెనీ’ వంటివి ఉన్నాయి. దిల్లీలోని ప్రముఖ హోటల్స్లో స్టాండప్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించి, నెట్ఫ్లిక్స్కు అనేక కామెడీ షోలు చేశాడు. ఆమిర్ఖాన్ నిర్మాణంలో గత ఏడాది ‘హ్యాపీ పటేల్’ సినిమాకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
వీర్దాస్ (46)
వన్లైనర్ వండర్...
ఒక స్టాండప్ కమెడియన్కు 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటేనే అతడి సత్తా ఏమిటో తెలిసిపోతోంది. దిల్లీకి చెందిన అభిషేక్ ఉపమన్యు నిత్యజీవితంలో నుంచి సంఘటనలను తీసుకుని, అందులో నుంచి నవ్వులను సృష్టిస్తాడు. అతడు వేసే జోకులు ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. తెగ నవ్విస్తాయి. మానవ సంబంధాలు, టెక్నాలజీపై కూడా కామెడీ అస్ర్తాలు సంధిస్తాడు. సమకాలీన హాస్యాన్ని తన షోలో భాగం చేసుకుంటాడు. సృజనాత్మకంగా జోకులను పేల్చడం అభిషేక్ ప్రత్యేకత. అతడి ‘టాక్సిక్’ లైవ్ షోకు దిల్లీ, ముంబయ్, బెంగళూరు, గోవాల్లో అభిమానులున్నారు. సోషల్ ప్లాట్ఫామ్స్లో టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతాయి. ‘క్రైమ్ అండ్ కాస్మోస్’, ‘మ్యారేజ్ అండ్ ఇండియన్ ఇంగ్లీష్’, ‘దిల్లీ, ముంబయ్ అండ్ రిచ్ పీపుల్’ షోలకు యూట్యూబ్లో లక్షలాది వీక్షకులున్నారు.
పాపులర్ కామెడీ షో ‘కపిల్శర్మ షో’లో కూడా పాల్గొని అందర్నీ తన పంచ్లతో కడుపుబ్బా నవ్వించాడు. వెటకారపు ‘వన్ లైనర్స్’ వేయడంలో ఘనాపాఠిగా పేరు తెచ్చుకున్నాడు. పంజాబ్ యూనివర్శిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకుని కొన్నేళ్లు బుద్ధిగా ఉద్యోగం చేశాడు. 2013లో కార్పోరేట్ ఉద్యోగాన్ని వదులుకుని, నవ్వుల కలను పండించుకునేందుకు స్టాండప్ కమెడియన్ అయ్యాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. నిరంతరాయంగా నవ్వులు పండిస్తూ, ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు.
అభిషేక్ ఉపమన్యు (36)
నవ్వుల లెక్క తేలుస్తాడు...
‘టీచర్ వర్సెస్ స్టూడెంట్స్’ అంటూ పాఠశాలల నేపథ్యంలో ఆశిష్ సోలంకీ వేసే జోకులు వింటే తెగ నవ్వుతాం. అత్యధిక వీక్షకులున్న యూట్యూబ్ ఛానెల్ను నడుపుతున్న ఆశిష్ తన స్టాండప్ కామెడీ ప్రదర్శనలను పోస్ట్ చేస్తుంటాడు. దిల్లీలోని బురారికి చెందిన ఈ కమెడియన్ దేశంలో వివిధ నగరాల్లో సోలోగా ప్రదర్శనలిస్తుంటాడు. తాజాగా ‘టెల్లింగ్ లైస్’ పేరిట ఆలిండియా టూర్ చేస్తున్నాడు. ‘కామిక్స్తాన్’ సీజన్3 విజేతగా గుర్తింపు తెచ్చుకుని, ఆ క్రేజ్తో స్టాండప్ కమెడియన్గా స్థిరపడ్డాడు.
ఇంజనీరింగ్ చదివి, మాథ్స్ టీచర్గా కొన్నేళ్లు పనిచేసిన తర్వాత స్టాండప్ కామెడీవైపు అడుగులు వేశాడు. ఒక అంశాన్ని కామెడీగా చెప్పడంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించే ఆశిష్ జోక్ వేస్తే నవ్వని వారుండరు. అందుకే అతడి షోలన్నీ హౌస్ఫుల్ అవుతుంటాయి. ముఖ్యంగా టెకీలు బాగా ఎంజాయ్ చేస్తారు. మారుతున్న సంస్కృతిని, కుటుంబ సంబంధాలను బాగా పరిశీలించి, వాటిల్లో నుంచి కామెడీని రాబడతాడు.
ఆశిష్ సోలంకీ (29)
ఇండియన్ ‘టీనా ఫే’
అమ్మాయిలు కూడా అద్భుతంగా హాస్యాన్ని పండిస్తారు... అమ్మాయిలు కూడా జోకులు బాగా వేస్తారు... అని నిరూపించుకున్నవారిలో స్టాండప్ కమెడియన్ సుముఖి సురేష్ ముందువరుసలో ఉంటారు. అమెరికన్ ప్రముఖ నటి, కమెడియన్ టీనా ఫేతో సుముఖిని పోల్చుతారంటే ఆమె టాలెంట్ను అర్థం చేసుకోవచ్చు. నాగ్పూర్లో పుట్టి పెరిగిన ఈ కామెడీ స్టార్ గ్రాడ్యుయేషన్ కోసం బెంగళూరుకు వెళ్లారు. అక్కడే ఆమెకు తనలో దాగి ఉన్న టాలెంట్కు తగ్గ వేదిక దొరికింది.
కామెడీ షో వేదిక ‘ది ఇంప్రూవ్’లో ఆమెకు స్థానం లభించింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, తనలోని కళకు మెరుగులు దిద్దుకున్నారు. ‘ది ఇంప్రూవ్’ సభ్యురాలిగా బెంగళూరు, హైదరాబాద్, ముంబయ్, స్వీడన్లలో వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. 2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి స్టాండప్ కామెడీనే కెరీర్గా ఎంచుకుని దూసుకుపోతున్నారు. ఆమె చేసిన ‘అను ఆంటీ’, ‘డోంట్ టెల్ అమ్మ’ పాపులర్ అయ్యాయి. ఈ కామెడీ స్టార్కు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
సుముఖి సురేష్ (38)
హాస్య శేఖరుడు
ఆయనో హార్వర్డ్ గ్రాడ్యుయేట్. ఫిలాసఫీలో పీహెచ్డీ చేశారు. ఇదంతా తండ్రి సంతృప్తి మేరకే. ఆయనలో సహజంగా హాస్యచతురత ఉంది. ఆ ఫైర్ నిలకడగా ఉండనీయలేదు. ఫలితంగా స్టాండప్ కమెడియన్ అవతారం ఎత్తాడు. ఆయనే రాజశేఖర్ మామిడన్న (ఆర్ఎస్ఎం). ‘లెజెండ్ ఆఫ్ రామ్’ అంటే హైదరాబాదీయులకే కాదు... దేశవ్యాప్తంగా అనేక నగరవాసుల పెదవులపై చిరునవ్వులు పూస్తాయి. రామాయణాన్ని వినోదాత్మకంగా, ఎవరినీ నొప్పించని రీతిలో చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. మ్యూజికల్ కామెడీ, క్రౌడ్ ఇంటరాక్షన్ కామెడీలో అద్భుతాలు చేస్తారు.
కుటుంబ సమేతంగా ఆయన కామెడీ షోలకు హాజరవుతారు. అంటే అంత క్లీన్ కామెడీ ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా మనదేశంలోనే వివిధ నగరాల్లో 200కు పైగా ప్రదర్శనలిచ్చారు. విదేశాల్లో సైతం రాజశేఖర్ షోలకు క్రేజ్ ఉంది. కామెడీ క్లబ్లు, థియేటర్స్, కార్పోరేట్ ఈవెంట్స్లో ఆయన స్టాండప్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. రాజశేఖర్ ‘డాగ్స్ మెన్ అండ్ వుమెన్’, ‘కిడ్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్’, ‘ఫైనల్ డెస్టినేషన్ అండ్ హెచ్ఆర్’, ‘హారిబుల్ సింగల్’ వీడియోలు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి.
రాజశేఖర్ మామిడన్న (42)
యూనివర్శిటీ నుంచే
‘కామికిస్తాన్’ సెకండ్ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన మరో స్టాండప్ కమెడియన్ ఆకాశ్ గుప్తా. దిల్లీలో పుట్టి పెరిగిన ఆకాశ్కు చిన్నప్పటి నుంచి హాస్యంపై పట్టుంది. దిల్లీ యూనివర్శిటీలో చదివిన ఆకాశ్ కాలేజీ ఫంక్షన్లో జోకులు వినిపించి అరంగేట్రం చేశాడు. థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో నాటకాలు కూడా వేసేవాడు. 2014లో రేడియో మంత్రలో ఇంటర్న్షిప్ చేశాడు. 2017లో తన మొదటి స్టాండప్ కామెడీ వీడియోను యూట్యూబ్లో విడుదల చేశాడు. ‘ట్రైన్ జర్నీస్ అండ్ హనీమూన్ ట్రిప్స్’, ‘క్లబ్బింగ్ అండ్ కాక్టెయిల్స్’ పేరు తెచ్చాయి.
‘భాయ్ ఖుష్ రహా కర్’ సోలో స్టాండప్ కామెడీ ప్రదర్శనతో ఈ రంగంలో స్థిరపడ్డాడు. ‘డాగ్స్ ఫాలోవ్డ్ బై సరోజినీ నగర్’ కామెడీ యూట్యూబ్లో ట్రెండింగ్గా నిలిచి, సంచలనం సృష్టించింది. కమెడియన్ సునీల్ గ్రోవర్తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఎల్ఓఎల్: హసీ తో ఫసీ’ కామెడీ రియాలిటీ షో చేశాడు. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఆకాష్ కామెడీ షోలకు 534 మిలియన్ల వ్యూస్ ఉన్నాయంటే... అతడి కామెడీ టైమింగ్ ఎలాంటిదో అర్థమవుతుంది.
ఆకాశ్ గుప్తా (33)
కొంటె కోణంగి...
ప్రకటనలకు, టీవీ షోలకు రచయిత్రిగా పనిచేసిన నీతీ పల్టా... ఆ అనుభవంతోనే నెమ్మదిగా కామెడీ రంగంలోకి అడుగిడింది. తన చుట్టూ ఉండేవారిని జోకులు వేస్తూ అస్తమానం నవ్విస్తుండే నీతికి కామెడీనే కెరీర్గా ఎంచుకుంటే బాగుండుననిపించింది. స్టాండప్ కమెడియన్గా మారి తనలోని కామెడీ రచయిత్రికి మెరుగులు దిద్దింది. వేదికలపై ఆమె వేసే జోకులు బ్రహ్మాండంగా పేలాయి. ‘కొంటె కోణంగి’గా పేరుతెచ్చుకున్న నీతి... ‘రా ఓ జెడ్ ఫెస్ట్’లో ఉత్తమ స్టాండప్ కమెడియన్గా ఎంపికయ్యింది. మెల్బోర్న్లో జరిగిన అంతర్జాతీయ స్టాండప్ కామెడీ ఫెస్టివల్లో మనదేశం తరపున పాల్గొని సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో పుట్టి పెరిగిన నీతీ ‘ఆల్మోస్ట్ సంస్కారీ’ టీవీ షో హాస్యప్రియులను అలరించింది. నీతీ పల్టా (46)
మ్యూజికల్ కామెడీ
మొదట్లో ఇంగ్లీష్లో కామెడీ షోలు మొదలుపెట్టి, నెమ్మది నెమ్మదిగా హిందీలో చేస్తూ అత్యధిక ఆదరణ పొందుతున్నాడు కెన్నీ సెబాస్టియన్. కేరళకు చెందిన కెన్నీ తండ్రి ఇండియన్ నేవీలో పనిచేయడం వల్ల చిన్నతనం నుంచే ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్ని నేర్చుకున్నాడు. బెంగళూరులోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు తనలోని హాస్యచతురతను గుర్తించాడు. తొలుత ‘కెన్నీ సింగ్ ఫర్ మీ’తో పాపులరైన కెన్నీ ఇతర స్టాండప్ కమెడియన్స్తో కలిసి షోలు చేసేవాడు. ఆ తర్వాత సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని కామెడీ సిరీస్ చేయడం ప్రారంభించాడు. గాయకుడు కూడా కావడంతో కామెడీ షోకు అదనపు ఆకర్షణను తీసుకొస్తాడు. విదేశాల్లో ఎక్కువగా ప్రదర్శనలిస్తున్నాడు.
కెన్నీ సెబాస్టియన్ (35)
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News