నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - May 03 , 2026 | 09:22 AM
ద్వారకాతిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు(ఆదివారం)తో ముగియనున్నాయి. నేడు శయన శ్రీమహావిష్ణువు అలంకరణలో చిన్న వెంకన్న భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఏలూరు, ఏప్రిల్ 03: ద్వారకాతిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు(ఆదివారం)తో ముగియనున్నాయి. నేడు శయన శ్రీమహావిష్ణువు అలంకరణలో చిన్న వెంకన్న భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించనున్నారు. అలాగే ఈ రోజు రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పుష్పయాగం, పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
ఏప్రిల్ 26వ తేదీన ఈ శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు స్వామి అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లి కూతుర్లుగా అలంకరించారు. 27వ తేదీన అంకురార్పణ, ధ్వజారోహణ చేపట్టారు. 29న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. మే 1వ తేదీన స్వామి వారి రథోత్సవం జరిపారు.
మే 3వ తేదీన చూర్ణోత్సవం, వసంతోత్సవం, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవలతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి ఆలయంలో నిత్యం జరిగే ఆర్జిత సేవలు, నిత్య కళ్యాణాలు రద్దు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలి వచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు.