దారుణం.. మహిళను చంపి.. శరీర భాగాలతో బిర్యానీ!
ABN , Publish Date - Aug 23 , 2026 | 10:24 AM
తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో ఓ సూట్కేస్లో మానవ శరీర భాగాలు లభించిన కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. మహిళను చంపి శరీర భాగాలతో బిర్యానీ వండినట్లు గుర్తించారు.
చెన్నై, ఆగస్టు 23: చెన్నైలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను చంపి.. శరీర భాగాలతో బిర్యానీ వండారు. ఈనెల 5న తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో ఓ సూట్కేసులో మానవ శరీర భాగాలు లభించిన కేసును చెన్నై పోలీసులు ఛేదించే క్రమంలో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 5న చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ఆగ్రాకు చేరుకుంది. ఓ జనరల్ కంపార్ట్మెంట్లో తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు అక్కడి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు బోగీలో తనిఖీలు నిర్వహించి ఓ ఎరుపు రంగు సూట్కేస్ నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించారు.
ఆ సూట్కేస్ను తెరచి చూడగా.. అందులో మానవ శరీర భాగాలు కనిపించాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ సూట్కేస్ చెన్నై నుంచి వచ్చినట్లు తేల్చారు. వెంటనే యూపీ పోలీసులు.. తమిళనాడు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు చెన్నై పోలీసుల సహకారంతో రైల్వే స్టేషన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 350కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.
రెడ్ కలర్ సూట్కేస్తో వచ్చిన ఓ పురుషుడు, మహిళ తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్లో దాన్ని బోగీలో ఉంచి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితులిద్దరూ లోకల్ ట్రైన్లో గూడువాంజేరి చేరుకున్నారు. వారు నివాసముండే ఇంటిని గుర్తించిన పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్.. అతని భార్య భాగమతి మాజిక్తో ఉంటున్నాడని, వారితో పాటు హయాత్ నిషా అనే మహిళా ఉంటుందని స్థానికులు తెలిపారు. దీంతో హత్యకు గురైంది నిషాగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు లస్కర్ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఓ బిర్యానీ పాత్రలో రైస్తో పాటు మానవ శరీరం ముక్కలు కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. అంతేకాక ఇల్లంతా రక్తపు మరకలను గుర్తించారు. బిర్యానీ పాత్రను స్వాధీనం చేసుకుని చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హత్యకు గురైన మహిళ తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. లస్కర్ దంపతులు తనకు తమ్ముడు, మరదలు అవుతారని నిషా తమకు స్థానికులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మహిళను హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐఫోన్ మోజు.. యువతపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే..
ఒడిశా తీరానికి సమీపంలో కార్గో నౌక మునక.. 22 మంది గల్లంతు..