ఐఫోన్ మోజు.. యువతపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే..
ABN , Publish Date - Aug 23 , 2026 | 10:56 AM
చేతిలో ఐఫోన్ ఉండడం చాలా మందికి ఓ స్టేటస్ సింబల్. అత్యంత ఖరీదైన ఈ మొబైల్ కోసం జెన్ జెడ్ చూపిస్తున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఐఫోన్ను దక్కించుకోవాలనే ఒత్తిడిలో చాలా మంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చేతిలో ఐఫోన్ ఉండడం చాలా మందికి ఓ స్టేటస్ సింబల్. అత్యంత ఖరీదైన ఈ మొబైల్ కోసం జెన్ జెడ్ చూపిస్తున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఐఫోన్ను దక్కించుకోవాలనే ఒత్తిడిలో చాలా మంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐఫోన్ను దక్కించుకునే ఉన్మాదపు ప్రయత్నంలో చాలా మంది ఇతరులను చంపడం, చోరీలకు పాల్పడడం, ఆత్మహత్య చేసుకోవడం వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నాశనానికి అతిపెద్ద మూల కారణం సులభ వాయిదాల పథకం, లేదా ఈఎంఐ (iPhone craze India).
కౌంటర్పాయింట్ రీసెర్చ్ అంచనాల ప్రకారం, 2026లో భారత్లో అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో 42 శాతం వరకు ఈఎంఐలు, క్రెడిట్ కార్డు వాయిదాలు లేదా ఎన్బీఎఫ్సీ రుణాల ద్వారా కొనుగోలు చేశారు. 2025తో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువగా ఉంది. పెరుగుతున్న ఫోన్ ధరలు, సులభమైన ఫైనాన్సింగ్ దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఐఫోన్లను ఉపయోగించాలనే వేలం వెర్రి మహా నగరాల యువతకే పరిమితం కావడం లేదు.. చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా వీటి వాడకం విపరీతంగా పెరిగింది (iPhone EMI India).
నిజానికి 2026లో భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 10% క్షీణత ఉంది. ఆసక్తికర అంశం ఏంటంటే.. చౌక స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 88 శాతం పడిపోగా, రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష మధ్య ధర ఉన్న ప్రీమియం ఫోన్ల అమ్మకాలలో 72% పెరుగుదల నమోదైంది. దీనికి ప్రధాన కారణం సులభమైన ఫైనాన్సింగ్ ఆఫర్లే (Gen Z financial stress).
ఐఫోన్ల కోసం జరిగిన ఘోరాలు ఇవే..
2026 ఆగస్టులో, మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్కు చెందిన 18 ఏళ్ల బాలుడు ఐఫోన్ కావాలనే కోరికతో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో అతడి తండ్రి కిందపడిపోగా, ఆ దారుణ దృశ్యాన్ని చూసిన తల్లి కూడా దూకేసింది.
2024 సెప్టెంబర్లో, లక్నోకు చెందిన ఒక వ్యక్తి క్యాష్-ఆన్-డెలివరీ పద్ధతిలో రూ. 1.5 లక్షల విలువైన ఐఫోన్ను ఆర్డర్ చేశాడు. డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, అతడు డెలివరీ ఏజెంట్ను హత్య చేసి, మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి, కాలువలో పడేశాడు.
2024లో, నవీ ముంబైలో నివసిస్తున్న 18 ఏళ్ల బాలుడు, రూ. 1.5 లక్షల విలువైన ఐఫోన్ను కావాలని తన తండ్రిని డిమాండ్ చేశాడు. ఆ తండ్రి నిరాకరించడంతో, ఆ కుర్రాడు తీవ్ర ఆగ్రహానికి గురై ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
2024లో, ఢిల్లీలోని నజాఫ్గఢ్కు చెందిన 9వ తరగతి విద్యార్థి, తన ప్రియురాలికి ఐఫోన్ కొనివ్వడం కోసం తన తల్లి బంగారం, వెండి నగలను దొంగిలించి అమ్మేశాడు. చివరకు జైలుపాలయ్యాడు.
2023లో, ఉత్తర ప్రదేశ్లోని ఘాజీపూర్లో ఒక బాలుడు, తన సోదరి పెళ్లి కోసం తల్లిదండ్రులు దాచుకున్న లక్ష రూపాయలను దొంగిలించి, ఆ డబ్బుతో ఒక ఐఫోన్ కొన్నాడు. తల్లిదండ్రులకు తెలిసిపోవడంతో భయపడి రైలు కింద పడి మరణించాడు.
ఇవి కూడా చదవండి..
ఒడిశా తీరానికి సమీపంలో కార్గో నౌక మునక.. 22 మంది గల్లంతు..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..