ఒడిశా తీరానికి సమీపంలో కార్గో నౌక మునక.. 22 మంది గల్లంతు..
ABN , Publish Date - Aug 23 , 2026 | 07:32 AM
పనామా జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌక బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పనామా జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌక బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే భారత కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఇద్దరిని సముద్రంలో నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది (Panama flagged cargo ship).
ఎంవీ ఓషన్ విన్నర్ అనే ఈ నౌక ఆగస్టు 20న రాత్రి సుమారు 10.42 గంటలకు పారాదీప్ నుంచి బయలుదేరింది. ఒడిశా నుంచి సింగపూర్కు వెళ్తున్న ఈ నౌకలో 72,100 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిలో 20 మంది చైనా, ముగ్గురు మయన్మార్, ఒకరు బంగ్లాదేశ్కు చెందినవారు ఉన్నారు. ఆగస్టు 22న ఉదయం 11.48 గంటలకు ఎంవీ ఓషన్ విన్నర్తో సంబంధాలు తెగిపోయినట్లు శ్రీ విజయపురంలోని సముద్ర రక్షణ సమన్వయ కేంద్రానికి సమాచారం అందింది (Odisha coast ship sinking).
నౌకను నిర్వహిస్తున్న సంస్థ నుంచి సమాచారం అందడంతో అధికారులు వెంటనే రక్షణ చర్యలను ప్రారంభించారు. నౌక మునిగినట్లు నిర్ధారణ కావడంతో భారత కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా భారీ రక్షణ చర్యలు చేపట్టాయి. కోస్ట్ గార్డ్కు చెందిన వరద్, అన్మోల్ నౌకలను గాలింపు కోసం పంపించారు. శ్రీ విజయపురం నుంచి విజిత్ నౌకను కూడా సహాయక చర్యలకు మోహరించారు (Indian Coast Guard rescue).
సమీపంలో ప్రయాణిస్తున్న ఇతర నౌకలను సైతం అప్రమత్తం చేసి రక్షణ చర్యల్లో సహకరించాలని కోరారు. సముద్రంలో లైఫ్ రాఫ్టుల నుంచి ఇద్దరు సిబ్బందిని రక్షించారు. మిగిలిన సిబ్బంది పరిస్థితిపై స్పష్టత కోసం గాలింపు కొనసాగుతోంది. నౌక ఏ కారణంగా మునిగిపోయిందనే విషయం ఇంకా వెల్లడికాలేదు.
ఇవీ చదవండి:
ఐఫోన్ ఈఎంఐ కోసం గొడవ.. చివరకు కుమారుడితో పాటు తల్లిదండ్రుల మృతి
అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి.. పాకిస్థాన్ ఆగ్రహంపై భారత్ స్పందన