ఐఫోన్ ఈఎంఐ కోసం గొడవ.. చివరకు కుమారుడితో పాటు తల్లిదండ్రుల మృతి
ABN , Publish Date - Aug 22 , 2026 | 09:33 AM
మహారాష్ట్రలో ఐఫోన్ ఈఎంఐ చెల్లింపు విషయంలో కుటుంబంలో తలెత్తిన వివాదం విషాదానికి దారితీసింది. కొండపై నుంచి పడిపోవడంతో 18 ఏళ్ల యువకుడితో పాటు అతని తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ ఈఎంఐ చెల్లించే విషయంలో కుటుంబంలో జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో 18 ఏళ్ల కునాల్ అనే యువకుడితో పాటు అతని తల్లిదండ్రులు మురళీధర్ చంద్గూడే, సంగీత మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రకారం.. కునాల్ ఇటీవల ఐఫోన్ కొనుగోలు చేశాడు. దాని ఈఎంఐలు చెల్లించేందుకు కుటుంబ సభ్యులను డబ్బులు అడిగాడు. ఈ విషయంలో తండ్రితో కునాల్కు గొడవ జరిగింది. దీంతో తీవ్రంగా మనస్తాపానికి గురైన కునాల్ ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం టిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి వెళ్లాడు.
మూడు గంటల పాటు నచ్చజెప్పే ప్రయత్నం
కునాల్ కొండపైకి వెళ్లిన విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులు కూడా అక్కడికి వచ్చి కునాల్ను కిందకు రావాలని నచ్చజెప్పారు. దాదాపు మూడు గంటల పాటు అతనితో మాట్లాడి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. టిస్గావ్ గ్రామ మాజీ సర్పంచ్ సంజయ్ జాదవ్ కూడా కునాల్తో మాట్లాడి అతడిని కిందకు రావాలని కోరారు. దూకవద్దని పలువురు అతడిని బతిమిలాడారు. కొందరు ఐఫోన్ 15 ప్రో కొనిస్తామని కూడా చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ కునాల్ ఎవరి మాట వినలేదు. తనకు చావే మార్గమని చెబుతూ కొండ అంచునే నిలబడ్డాడు.
కొడుకును కాపాడబోయి తండ్రి కూడా..
మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో కునాల్ తండ్రి కొండ అంచు వద్దకు వెళ్లాడు. తన కుమారుడిని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరూ అదుపుతప్పి లోయలో పడిపోయారు. ఈ ఘటనను కళ్లారా చూసిన కునాల్ తల్లి సంగీత కొద్దిసేపటికే కొండపై నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఘటనపై దర్యాప్తు
ఈ ఘటనకు ముందు కుటుంబంలో జరిగిన వివాదం, ఐఫోన్ ఈఎంఐ చెల్లింపుల అంశం తదితర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కునాల్ మానసిక ఒత్తిడిలో ఉన్నాడా? కుటుంబ సమస్యలు మరేదైనా ఉన్నాయా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కొండ వద్ద పెద్ద సంఖ్యలో స్థానికులు ఉన్నారు. కునాల్ను కిందకు తీసుకురావడానికి వారు చేసిన ప్రయత్నాల్లో కొన్ని దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.
Also Read:
అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి.. పాకిస్థాన్ ఆగ్రహంపై భారత్ స్పందన..
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత