Share News

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ABN , Publish Date - Jul 23 , 2026 | 04:52 PM

విద్యార్థుల నిరసనలపై సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర దుమారానికి తెరతీసింది. నిరసనకారులను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇంతకీ ఏమా పోస్ట్? అనే వివరాల్లోకెళితే...

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
RAF Officer Sonia Shekhawat Cockroach Instagram Post

ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థుల నిరసనలపై సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర దుమారానికి తెరతీసింది. దీంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ARF) అసిస్టెంట్ కమాండెంట్ సోనియా షెహ్రావత్ వివాదంలో చిక్కుకున్నారు. నిరసనకారులను ఉద్దేశిస్తూ ఆమె ఇన్‌స్టా స్టోరీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో వెంటనే దానిని ఆమె రిమూవ్ చేశారు.


అసలేం జరిగిందంటే?

హరియాణాకు చెందిన సోనియా షెహ్రావత్‌కు సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 6 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. విధి నిర్వహణకు సంబంధించిన అంశాలతోపాటు వ్యక్తిగత జీవితం, ప్రయాణాలు, వ్యాయామం, ఆధ్యాత్మికత వంటి విషయాలకు సంబంధించిన పోస్టులను ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారామె. అలాగే.. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనల సమయంలో విధుల్లో పాల్గొన్న ఆమె.. తన ఇన్‌స్టా స్టోరీలో చనిపోయిన బొద్దింక ఫొటోను ఒకదానిని షేర్ చేశారు. దానికి 'తమను తాము మార్చుకోలేని వారు దేశాన్ని మార్చాలనుకుంటున్నారు' అనే క్యాప్షన్ జోడించారు. ఇది కాసేపటికే నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న సీజేపీ.. 'ఎక్స్'లో ఆమెపై విమర్శలకు దిగింది. శాంతియుత నిరసనకారులను ఇలా కాక్రోచ్‌లతో పోల్చడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ఈ వివాదం మరింత ముదరడంతో తన ఇన్‌స్టా స్టోరీని వెంటనే తొలగించారు సోనియా.

Sehra post_23_July_26.webp


కాగా.. ఈ ఘటనతో కేంద్ర భద్రతా బలగాల సర్వీస్ నిబంధనలపైనా చర్చ మొదలైంది. విధి నిర్వహణలో ఉన్న అధికారులు ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయరాదని, వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో యూనిఫాం ఫొటోలను ఉపయోగించకూడదని నిబంధనల ద్వారా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సోనియా పోస్ట్ నిబంధనలకు విరుద్ధమనే అంశంపై చర్చ జోరందుకుంది. అయితే.. ఈ విషయంలో సోనియా తన వైఖరిని సమర్థించుకున్నారు. విద్యార్థుల నిరసనల్లో కొందరు అసాంఘిక శక్తులు చొరబడి రాళ్లు, గాజు సీసాలు, చెప్పులతో దాడి చేశారని.. మహిళలను రక్షించే ప్రయత్నంలో తన చేతికి గాయమైందనీ తెలిపారు. తన మెడపై గోళ్లతో గీసిన గాయాలను కూడా ఆమె మీడియాకు చూపించారు.


ఇవీ చదవండి:

ఢిల్లీ ఆందోళనల్లో సంఘ విద్రోహ శక్తుల చొరబాటు!: ఢిల్లీ పోలీసులు

ముంబై నిరసనల్లో పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్న యువతి.. వీడియో వైరల్

Updated Date - Jul 23 , 2026 | 04:55 PM