ఢిల్లీ ఆందోళనల్లో సంఘ విద్రోహ శక్తుల చొరబాటు!: ఢిల్లీ పోలీసులు
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:24 PM
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలపై పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. నిరసనల పేరిట సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల్లో సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల మధ్య దాక్కుని ఉంటూనే.. కొందరు వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లు, వాటర్ బాటిళ్లతో తమపై దాడులకు దిగుతున్నారన్నారు. దీంతో శాంతియుతంగా కొనసాగాల్సిన నిరసనలు కాస్తా సాయంత్రమయ్యేసరికి హింసాత్మకంగా మారుతున్నాయని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం.. పగటి వేళల్లో నిరసనకారులు కవితలు చదవడం, నినాదాలు చేయడం వంటి శాంతియుత కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. సాయంత్రం అవ్వగానే భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతోంది. కొందరైతే పోలీసులే లక్ష్యంగా రాళ్లు రువ్వడం, రోడ్లెక్కి అల్లర్లు చేస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంటోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేసేందుకు జంతర్మంతర్ వద్ద అదనపు పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. విద్యార్థుల అంశాన్ని సున్నితంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారం కోరుతూ.. ఎలాంటి కఠిన చర్యలకు పాల్పడవద్దని ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నాయి. అందుకే అత్యంత సంయమనంతో వ్యవహరిస్తున్నామని.. రాళ్లురువ్వినా ఎదురుదాడికి దిగకుండా శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశాయి.
ఇవీ చదవండి:
ముంబై నిరసనల్లో పోలీస్ వ్యాన్ను అడ్డుకున్న యువతి.. వీడియో వైరల్
ఢిల్లీలో మళ్లీ హింసాత్మక ఘర్షణలు.. పోలీసులపై రాళ్లురువ్విన నిరసనకారులు