ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్చుక్ భార్య విమర్శలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 03:50 PM
న్యూఢిల్లీలోని ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ జులై 21న చేపట్టిన నిరసనపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి విమర్శలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలోని ప్రధాని నివాసం ముందు జులై 21న నీట్ పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి విమర్శించారు. కాంగ్రెస్ నిరసనల్లో చిత్తశుద్ధి లోపించిందని అన్నారు. జంతర్మంతర్ వద్ద విద్యార్థులు నిరసనకు దిగినప్పుడే కాంగ్రెస్ కూడా వచ్చి నిరసనల్లో పాలుపంచుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. పేపర్ లీక్ ఉదంతంపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జంతర్మంతర్ వద్ద తొలుత ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తరువాత పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు.
నిరసనల్లో రాజకీయ పార్టీలు కూడా రంగ ప్రవేశం చేయడంపై వాంగ్చుక్ భార్య పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వాంగ్చుక్ పేరుప్రఖ్యాతులను తమకు అనుకూలంగా వాడుకునేందుకు రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అయితే, ప్రజలను మభ్యపెట్టడం ఇక సాధ్యం కాదని అన్నారు. చిత్తశుద్ధి లేని వారిని యువతే పంపించేస్తారని అన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో నిరసనలు రాజకీయ పక్షాలకు గట్టి సందేశం పంపించాయని ఆమె అన్నారు. తమ దృష్టిలో పార్లమెంటే అత్యున్నత వ్యవస్థ అని, తమకు ఇక ప్రతిపక్షం, పాలకపక్షం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటే ఈ అంశంపై దృష్టి సారించాలని కోరుతున్నామని అన్నారు. రాజకీయ లక్ష్యాలు లేని వారు తమతో కలిసి రావచ్చని అన్నారు.
నిజాయతీ, స్వచ్ఛత పునాదిగా ఈ ఉద్యమం ఆరంభమైందని గీతాంజలి చెప్పారు. సొంత ఎజెండాలతో వచ్చే వారు తమంతట తామే పక్కకు తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. పార్లమెంటు వరకూ విద్యార్థులు చేపట్టిన మార్చ్ను కేంద్రం అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ఇతర నేతలు జులై 21న ప్రధాని నివాసం ముందు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసుల రాహుల్ గాంధీని అక్కడి నుంచి బలవంతంగా తరలించాల్సి వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు.. లోక్సభ రేపటికి వాయిదా
ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.. జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టు..