పరీక్షకు 42 గంటల ముందే 'నీట్' ప్రశ్నాపత్రం లీక్!.. 13 మంది అరెస్ట్
ABN , Publish Date - May 11 , 2026 | 10:06 AM
దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 13 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు అధికారులు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించిన నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) అధికారులు విచారణ చేపట్టారు. రాజస్థాన్, డెహ్రాడూన్లలో 13 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. పరీక్షకు ముందే 400కు పైగా ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని.. వాటిలో చాలా ప్రశ్నలు నీట్ పరీక్షతో సరిపోలుతున్నాయని అధికారులు తేల్చారు. అందులోని 100కు పైగా జీవశాస్త్ర, రసాయనశాస్త్ర ప్రశ్నలు.. పరీక్షకు సారూప్యంగా ఉన్నాయని ఎస్ఓజీ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ తెలిపారు.
అయితే.. దీనిని ఓ అంచనాగా భావిస్తున్నప్పటికీ.. దీని వెనుక ఏదైనా స్కామ్ దాగుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం.. నిందితులను విచారణ నిమిత్తం జైపుర్కు తరలించారు ఎస్ఓజీ అధికారులు. ఈ కేసులో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం.
అంతకుముందు.. మే 3న దేశవ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాలలో నీట్ పరీక్షను కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించామని ఎన్టీఏ తెలిపింది. ఆ తర్వాత ఈ నెల 7న రాత్రి ఆలస్యంగా ఓ అనుమానాస్పద సమాచారం అందిందని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ కోసం మరుసటి రోజు ఉదయమే కేంద్ర ఏజెన్సీలకు సమాచారం పంపినట్లు ఎన్టిఏ తెలిపింది. తాము దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని, పరీక్షకు సంబంధించిన డేటా, సాంకేతిక సమాచారాన్ని పంచుకుంటున్నామని పేర్కొంది.
ఇవీ చదవండి:
శ్మశాన వాటిక అడ్డాగా అక్రమ దందా.. శవాల మీది దుస్తులను..
విజయ్-రాహుల్ ఫొటో.. బ్లాక్ చేసిన ఇన్స్టా!