భారత అథ్లెటిక్స్కు స్వర్ణయుగం.. 'మన్ కీ బాత్'లో ప్రధాని ప్రశంసలు
ABN , Publish Date - May 31 , 2026 | 12:57 PM
భారత క్రీడాకారులు ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్లో ఆయన దేశ విదేశాల్లోని భారతీయులనుద్దేశించి మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రీడాకారులు ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్లో ఆయన దేశ విదేశాల్లోని భారతీయులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా భారత అథ్లెటిక్స్ రంగం సాధిస్తున్న పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీ. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు అసాధారణ ప్రతిభ కనబరిచారన్నారు. వివిధ విభాగాల్లో ఏకంగా 4 జాతీయ రికార్డులు నెలకొల్పారని గుర్తుచేశారు. గురిందర్వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్లు ఆయా విభాగాల్లో కొత్త రికార్డులు సృష్టించి క్రీడా ప్రతిష్ఠను పెంచారని కొనియాడారు.
పురుషుల 100 మీటర్ల స్ప్రింట్లో చోటుచేసుకున్న పరిణామాన్ని ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మూడుసార్లు జాతీయ రికార్డు బద్దలవడం భారత అథ్లెటిక్స్ చరిత్రలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. గురిందర్వీర్ సింగ్, అనిమేశ్ కుజూర్ లాంటి యువ అథ్లెట్ల ప్రదర్శనలు దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరిగేందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి విజయాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం సహా.. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తోడ్పడతాయని మోదీ చెప్పుకొచ్చారు.
వడగాలులతో జాగ్రత్త!
ఇక.. దేశవ్యాప్తంగా వీస్తున్న తీవ్ర వేడిగాలులపై మోదీ ప్రజలను అప్రమత్తం చేశారు. గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎక్కువగా నీరు తాగడం, ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఎదర్కొంటున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గత నెల 133వ ఎపిసోడ్లో భారత చారిత్రక రికార్డుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న 'నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా' గురించి కూడా నేటి మన్ కీ బాత్లో ప్రస్తావించారు మోదీ. దేశ చరిత్రకు సంబంధించిన 20 కోట్లకుపైగా చారిత్రక పత్రాలు, రికార్డులను.. ఆర్కైవ్స్ వాల్ పోర్టల్ ద్వారా డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిందని వివరించారు.
ఇవీ చదవండి:
ఆస్పత్రి సీఈఓకు మమతా బెనర్జీ వార్నింగ్.. దుమారం రేపుతున్న వీడియో..
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఐదుగురి అరెస్టు..