సభలో తొలిసారి వందేమాతరం ఆరు చరణాల ఆలాపన.. ముగిసిన వర్షాకాల సమావేశాలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:07 PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ రోజు లోక్సభ ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్తోపాటు సభ్యులంతా హాజరయ్యారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 13: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ రోజు లోక్సభ ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్తోపాటు సభ్యులంతా హాజరయ్యారు. జాతీయ గీతంలోని ఆరు చరణాలను పూర్తిగా ఆలపించిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో వర్షాకాల సమావేశాలు ముగిసినట్లు అయింది.
వందేమాతరం గీతాన్ని చట్టపరంగా రక్షణ కల్పించే శాసనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన కొన్ని రోజులకే లోక్సభలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా నిరోధించడం శిక్షార్హమైన నేరమని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. తద్వారా దీనికి జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన హోదా లభించినట్లు అయింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకావిష్కరణ, గవర్నర్ల ప్రసంగం వంటి సందర్భాల్లో వందేమాతరంలోని ఆరు చరణాలను ఆలపించాలని జనవరి 28వ తేదీన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో సుస్పష్టం చేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీన ప్రారంభమై.. ఆగస్టు 13వ తేదీతో ముగిశాయి. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్రం విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్య వ్యవస్థలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన బాట పట్టింది. జులై 20వ తేదీన వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ రోజు చలో పార్లమెంట్ యాత్రకు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ యాత్రకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
అలాగే భారీగా పోలీసులను మోహరించారు. ఈ యాత్రను సీజేపీ చేపట్టింది. ఈ యాత్రలో భారీగా యువత పాల్గొంది. వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
అదే విధంగా పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్లుతోపాటు పలు బిల్లులు ఆమోదం పొందాయి. అయితే ఢిల్లీలో యువతపై జరిగిన లాఠీ ఛార్జ్కు ఎవరు ఆదేశాలు ఇచ్చారో సభలో ప్రకటన చేయాలంటూ కేంద్రాన్ని ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సభలో దాదాపుగా వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు ఈ రోజు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
జమ్మూ కశ్మీర్లో గంటల వ్యవధిలో మళ్లీ భూ ప్రకంపనలు
హఫీజ్ సయీద్కు మద్దతు ప్రకటించి.. భారత్పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి
For National News And Telugu News