Prithviraj Chavan: మదురోలాగే మోదీని ట్రంప్ కిడ్నాప్ చేస్తారా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:24 PM
భారత్ ఎగుమతులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిందని, ఇది భారతీయ వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని చవాన్ అన్నారు. 50 శాతం సుంకంతో వ్యాపారం చేయడం సాధ్యం కాదన్నారు.
న్యూఢిల్లీ: అమెరికా వాణిజ్య విధానాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పృధ్వీరాజ్ చవాన్ (Prithviraj Chavan) తప్పుపడుతూ భారత్-వెనెజువెలా మధ్య తెచ్చిన ఒక పోలిక రాజకీయ వివాదానికి దారితీసింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. భారత్ ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించడం వల్ల తలెత్తిన పరిస్థితులపై చవాన్ మాట్లాడుతూనే వెనెజువెలాలో ఇటీవల జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. అనూహ్యమైన ప్రశ్నను లెవనెత్తారు.
'తరువాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. వెనెజువెలాలో జరిగినట్టే ఇండియాలో కూడా జరుగుతుందా? ట్రంప్ మన ప్రధానమంత్రిని కూడా కిడ్నాప్ చేస్తారా?' అని ప్రశ్నించారు. అమెరికా ఇటీవల వెనెజువెలాపై సైనిక చర్య చేపట్టి అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీగా తమ దేశానికి తరలించింది.
భారత్ ఎగుమతులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిందని, ఇది భారతీయ వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని చవాన్ అన్నారు. 50 శాతం సుంకంతో వ్యాపారం చేయడం సాధ్యం కాదని, నిజానికి ఇది భారత్ నుండి అమెరికాకు జరిగే ఎగుమతులను అడ్డుకోవడమే అవుతుందని తెలిపారు. ప్రత్యక్ష నిషేధం విధించలేరు కాబట్టే వాణిజ్యాన్ని ఆపడానికి సుంకాలను ఒక సాధనంగా ఉపయోగించారని, భారత్ ఇది భరించక తప్పదని అన్నారు.
చవాన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
చవాన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రపంచ స్థాయిలో భారత ప్రతిష్ఠను బలహీనపరచేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ దిగజారుడుకు ఇది నిదర్శనమని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు. ఇండియా పరిస్థితిని వెనెజువెలాతో పోల్చడం సిగ్గుచేటని, కాంగ్రెస్ దేశ వ్యతిరేక వైఖరి మరోసారి స్పష్టమైందని అన్నారు. భారతదేశ అంతర్గత వ్యవహరాల్లో విదేశీ జోక్యాన్ని కాంగ్రెస్ కోరుకుటోందని తప్పుపట్టారు.
ఖర్గే వ్యాఖ్యలు
చవాన్ వ్యాఖ్యలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్డున్ ఖర్గే సైతం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, మోదీ ఎందుకు ట్రంప్కు తలొంచుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇందువల్ల దేశానికి ప్రమాదమని అన్నారు. 'ఆయన (ట్రంప్) చెప్పినట్టు తల ఊపడానికి మిమ్మల్ని ప్రధానిగా ఎన్నుకోలేదు' అంటూ మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి..
విధి నిర్వహణలో వైఫల్యం.. సీఏక్యూఎంపై సుప్రీంకోర్టు అసహనం
ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి