గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలక మార్పులు.. కేంద్రం కొత్త నిబంధనలివే..
ABN , Publish Date - May 24 , 2026 | 12:21 PM
కొత్త గ్రామీణ ఉపాధి హామీ చట్టం 'వీబీజీ రామ్ జీ' ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఢిల్లీ, మే 24 (ఆంధ్రజ్యోతి): కొత్త గ్రామీణ ఉపాధి హామీ చట్టం 'వీబీజీ రామ్ జీ' (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్) ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కొత్త విధానం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర నిధుల కేటాయింపులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జనాభా, తలసరి ఆదాయాన్ని ఆధారంగా తీసుకుని నిధులను పంపిణీ చేయనుంది.
ఇందులో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు 42.5 శాతం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో వేతన భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించగా, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రాలపై కూడా ఆర్థిక బాధ్యత పెరగనుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్రాల పనితీరు ఆధారంగానే అదనపు నిధుల కేటాయింపు ఉండనుంది. కూలీలకు సమయానికి వేతనాల చెల్లింపు, సోషల్ ఆడిట్ అమలు, పనుల పూర్తి శాతం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రాల పనితీరును అంచనా వేయనున్నారు. ఈ మార్పులతో గ్రామీణ ఉపాధి పథకాల అమల్లో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
హైదరాబాద్ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా ఎదగాలి: కిషన్రెడ్డి
బీఆర్ఎస్లో హరీశ్రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
Read Latest Telangana News And AP News And International News And Telugu News